తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాగు సంబురంగా మారింది. దండగ అన్న ఎవుసం పండుగలా మారింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’తో అనుకున్న లక్ష్యం ఫలించింది. చెరువులు, కుంటల పూడిక తీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సాగునీటికి కొదువ లేకుండా పోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 1207 చెరువులు, కుంటలు ఉండగా, 78,091 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉన్నది. నాలుగు విడుతల్లో 790 చెరువులకు దాదాపు రూ. 246.95 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టగా, 70 వేల ఎకరాలకుపైగా సాగునీరందించేలా నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 2,132 చెరువులు, కుంటలు, కత్వాలు, చెక్డ్యామ్ల ద్వారా 70,067 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ‘మిషన్ కాకతీయ’తో జిల్లాలోని 956 చెరువులకుగాను రూ.132.95 కోట్లతో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.10.27 కోట్లతో 4 చెక్ డ్యామ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, పనులు పురోగతిలో ఉన్నాయి. గడిచిన వానకాలం వర్షాలు సమృద్ధిగా కురువడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో అయితే పైపైనే నీరు ఉండడం గమనార్హం.
వికారాబాద్, జూన్ 7, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో జిల్లాలోని చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. ప్రత్యామ్నాయ నీటి వనరులను సృష్టించడంలోనూ గత పాలకులకు ఎలాంటి ముందుచూపు లేకపోవడంతో గ్రామాల్లో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిపోయింది. అంతేకాకుండా చాలా చెరువులు కబ్జాలకు గురికావడంతోపాటు నామరూపాల్లేకుండా పోయాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకంతో రైతాంగంలో కొత్త ఆశలను చిగురించేలా చేశారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు తిరిగి జీవం పోసిందనే చెప్పుకోవచ్చు. నేడు జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా చేసిన చెరువుల పూడికతీత పనులతో జిల్లావ్యాప్తంగా దాదాపు 70 వేల ఎకరాలకుపైగా సాగునీరందించే విధంగా చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. అంతేకాకుండా భూగర్భజలాలు పెరగడంతోపాటు సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరగడం గమనార్హం. మరోవైపు జిల్లావ్యాప్తంగా 1207 చెరువులుండగా,…78,091 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న చెరువుల పండుగ సందర్భంగా మిషన్ కాకతీయతో సత్ఫలితాలు…నిండుకుండల్లా చెరువులపై ప్రత్యేక కథనం.
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులతో కృష్టా జలాల్లో మన వాటా జలాలు మనం వాడుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వికారాబాద్ జిల్లాలోనే మొదటి, రెండో, మూడో, నాలుగో విడుతల్లో చేపట్టిన పూడికతీత పనులతో కనీసం 5 టీఎంసీలకు పైగా వృథాగా పారే కృష్టాజలాలను ఒడిసి పట్టే అవకాశం కలుగుతుంది. గతంలో చెరువులు, కుంటలు పాడైన స్థితితో వాటిలో సగం నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీరు ఎక్కువగా నిల్వ ఉండేది కాదు. కట్టలకు పలు చోట్ల గండ్లు, తూములకు లీకేజీలతోపాటు అలుగులు పాడవడం వల్ల కురిసిన వర్షం నీరు ఎక్కువగా వృథాగా పోయేది. దాదాపు అన్ని చెరువులకు మరమ్మతులు చేయడంతో చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. ఫలితంగా నాలుగైదు ఏండ్లుగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు భారీగా పెరగడంతోపాటు సామర్థ్యం పెరిగింది. పూడిక తీతతో ఒక వైపు రైతుల పంట పొలాలు సారవంతంగా మారింది. గతంలో సగటున 20-30 ఎకరాలకు నీరందించే చెరువు మిషన్ కాకతీయ పనులతో 120 -130 ఎకరాలకు నీరందించే స్థితికి చేరుకున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి చెరువుల్లో పూడిక తీత పనుల వల్ల కనీసం 500 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (5 టీఎంసీల)వృథాగా పారే కృష్టా జలాలు చెరువుల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు చెరువులకు ప్రస్తుతముంది. జిల్లాలో 2014 అక్టోబర్లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులతో ప్రస్తుతం జిల్లాలో 5,88,977 ఎకరాలకు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా పరిధిలో మొత్తం 1207 చెరువులు, కుంటలు ఉండగా 77538 ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగు విడతల్లో 790 చెరువులకు దాదాపు రూ. 246 కోట్ల 95 లక్షల నిధులతో చెరువుల పునరుద్ధరణ పనులు చేశారు. మొదటి విడతలో 241 చెరువులకు రూ.83 కోట్ల 34 లక్షలు, రెండో విడుతలో 265 చెరువులకు రూ.118 కోట్ల 33 లక్షలు, మూడవ విడుతలో 129 చెరువులకు రూ.29 కోట్ల 52 లక్షలు, నాలుగవ విడుతలో 165 చెరువులకు రూ.17కోట్ల 76 లక్షలను నిధులిచ్చింది. నాలుగు విడతల్లో కలిపి దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందించేలా చెరువుల్లో పూడికతీత పనులు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగు నీరందించేందుకుగాను నీటిపారుదల శాఖ అధికారులు చెక్డ్యాంలను నిర్మాణాన్ని చేపట్టారు. జిల్లాలోని కాగ్నా, మూసీ నదులతోపాటు లఖ్నాపూర్ ప్రాజెక్టుతోపాటు వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రధాన వాగులపై చెక్డ్యాంలను నిర్మించేందుకుగాను రూ.66 కోట్లతో 18 చెక్డ్యాంలను నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది నిధులు విడుదల చేసింది. తాండూర్ నియోజకవర్గానికి 7 చెక్డ్యాంలు, పరిగి నియోజకవర్గానికి 2 చెక్డ్యాంలు, కొడంగల్ నియోజకవర్గానికి 5, వికారాబాద్ నియోజకవర్గానికి రెండు, చేవెళ్ల నియోజకవర్గానికి రెండు చెక్డ్యాంలు మంజూరు అయ్యాయి. తాండూర్ మండలం ఎల్మకన్నె సమీపంలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా తాండూర్ మండలం చిట్టిఘనాపూర్లో 80 శాతం పనులు, యాలాల్ మండలం గోవిందరావు పేటలో నిర్మిస్తున్న చెక్డ్యాం 85 శాతం, యాలాల మండలం కోకట్ సమీపంలో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు 60 శాతం, బషీరాబాద్ మండలం క్యాద్గిరాలో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు దాదాపు పూర్తికాగా, పెద్దేముల్ మండలం మాన్సాన్పల్లిలో, జీవంగిలో, ధారూర్ మండలం దోర్నాల్లో చెక్డ్యాం నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. నవాబుపేట్ మండలం ముబారక్పూర్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో చేపట్టిన రెండు చెక్డ్యాంలలో ఒక చెక్డ్యాం నిర్మాణం పూర్తికాగా, మోమిన్కలాన్ సమీపంలో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు 90 శాతం, బొంరాసుపేట్ మండలం బొంరాస్పేట్లోని కాకరవేణి ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి.
రంగారెడ్డి, జూన్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధించాక తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరికొత్త ప్రణాళికలు, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. తెలంగాణలో ముందుగా సాగు, తాగునీరు అందించేందుకు బృహత్తరమైన ప్రణాళికలను రచించి, తెలంగాణ పురోభివృద్ధి పాటు పడాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో ముందుగా చెరువులను పునరుద్ధరించాలని సంకల్పించారు. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం కావడంతో 2015లో ధ్వంసమైన చెరువులను బాగు చేసుకునేందుకు ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువుల పునరుద్ధరణతో పడావుపడ్డ భూముల్లోకి నీళ్లు వచ్చాయి. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందుకోగలుగుతున్నాం.
గత పాలకుల హయాంలో కనుమరుగైపోయిన నీటి వనరులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలోని మిషన్ కాకతీయ నాలుగు విడుతల్లో మొత్తం 999 చెరువులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 956 చెరువుల పునరుద్ధరణ పనులను రూ.132 కోట్ల 95 లక్షల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులు బాగు పడటంతో నీటి సామర్ధ్యం పెరిగి జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పనులకు గాను సుమారు 9,206 ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మొత్తం 50 చెరువుల మరమ్మతు పనులకు రూ.కోటి 25 లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో రూ.10 కోట్ల 27 లక్షల వ్యయంతో 4 చెక్ డ్యామ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగా పనులు పురోగతిలో ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ నీటి పారుదల రంగం దుర్భర స్థితిలో ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు చేపట్టింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’ను నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60% పూర్తయినది. త్వరలోనే పర్యావరణం అనుమతులను సాధించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది.
జిల్లాలో వ్యవసాయ సాగుకు చెరువులు, కుంటలు, కత్వాలు, చెక్డ్యామ్లు మొదలైనవి ప్రధానమైన వనరులు. జిల్లాలో సాగునీటి వనరులకు సంబంధించి 5 ఇరిగేషన్ డివిజన్లు ఉన్నాయి. హైదరాబాద్ డివిజన్ – 1, – 2, షాద్నగర్ – 3, చేవెళ్ల – 4, కల్వకుర్తి – 5; డివిజన్ – 1లో వంద ఎకరాలకు పైగా నీటిని అందించే చెరువులు 60 ఉన్నాయి. ఇవి 15,749.67 ఎకరాలకు నీటిని అందిస్తున్నాయి. 100 ఎకరాలకు తక్కువ మోతాదులో నీటిని అందించే చెరువులు, కుంటలు, కత్వాలు, చెక్డ్యామ్లు 732 ఉన్నాయి. ఇవి 16186.67 ఎకరాల్లో సాగునీటిని అందిస్తున్నాయి. డివిజన్ – 2కు సంబంధించి వంద ఎకరాలకు పైగా, తక్కువ మోతాదులో సాగు నీటిని అందించేలా 376 చెరువులు ఉన్నాయి. ఇవి 7,850 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. డివిజన్ – 3 (షాద్నగర్) 100 ఎకరాలకు పైగా సాగునీటిని అందించే చెరువులు 28 ఉన్నాయి. ఇవి 4341.41 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. కాగా, వంద ఎకరాలకు తక్కువ మోతాదులో 432 చెరువులు సేవలను అందిస్తున్నాయి. ఇవి 8923.85 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. డివిజన్ – 5 (చేవెళ్ల)కు సంబంధించి వంద ఎకరాలకు పైగా, ఇంకా తక్కువ మోతాదులో 203 చెరువులు సేవలందిస్తున్నాయి. 6845.00 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. డివిజన్ – 5 (కల్వకుర్తి) కి సంబంధించి వంద ఎకరాలకు పైగా 18 చెరువులు సేవలను అందిస్తున్నాయి. ఇవి 3885.37 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. వంద ఎకరాలకు తక్కువ మోతాదులో 280 చెరువులు సేవలందిస్తున్నాయి. ఇవి 6284.91 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో 2,132 చెరువులు, కుంటలు, కత్వాలు, చెక్డ్యామ్ల ద్వారా సాగునీటి పారుదల కొనసాగుతూ 70,067 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. పై ఐదు డివిజన్లలో మిషన్ కాకతీయ ద్వారా జిల్లాకు 1022 పనులు మంజూరయ్యాయి. చెరువుల పునరుద్ధరణకు సంబంధించి 806 పనులు పూర్తి అయ్యాయి. 138 పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. ఇందుకు గాను మొత్తం ఖర్చు రూ.10,393.234 లక్షలు. నాలుగు డివిజన్లలో చెక్డ్యామ్ వర్క్స్ పురోగతిలో కొనసాగుతున్నాయి. ఇందుకు గాను రూ.9.38 కోట్లలో పనులు మంజూరయ్యాయి.
నేడు ఊరూర చెరువుల పండుగ జరుపుకునేందుకు జిల్లా యావత్ సన్నద్ధం అయ్యింది. జిల్లాలోని 2068 చెరువులకు 1058 చెరువులు దాదాపు పునరుద్ధరించబడ్డాయి. కాగా, నేడు గురువారం 220 చెరువులు పండుగ జరుపుకునేందుకు సిద్ధంగాఉన్నాయి.
మహేశ్వరం నియోజకవర్గంలో – 58 చెరువులు సిద్ధమయ్యాయి. బాలాపూర్ – 10, మహేశ్వరం – 22, కందుకూరు – 26, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో – 26 చెరువులు, అవి.. ఇబ్రహీంపట్నం – 6, అబ్దుల్లాపూర్మెట్ – 5, యాచారం – 5, మంచాలలో – 9, హయత్నగర్ – 1గా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో – 30 చెరువులు సిద్ధమయ్యాయి. శంషాబాద్ – 26, గండిపేట – 3, రాజేంద్రనగర్ – 1; షాద్నగర్ నియోజకవర్గంలో – 54 చెరువులు, అవి ఫరూఖ్నగర్ – 24, కొత్తూరు – 5, నందిగామ – 3, కేశంపేట – 14, కొందుర్గ్ – 5, చౌదర్గూడెం – 3, చేవెళ్ల నియోజకవర్గంలో – 7 చెరువులు, అవి శంకర్పల్లి – 2, మొయినాబాద్ – 2, షాబాద్ – 2, చేవెళ్ల – 1, కల్వకుర్తి నియోజకవర్గంలో – 44 చెరువులు, అవి ఆమనగల్లు – 12, కడ్తాల్ – 14, తలకొండపల్లి – 8, మాడ్గుల – 10 చెరువులు; కాగా, శేరి లింగంపల్లి నియోజకవర్గంలో- 1 చెరువు సిద్ధంగా ఉంది.
ఊరూరా చెరువుల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేశాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించనున్న ‘ఊరూరా చెరువుల పండుగ’ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 16 మున్సిపల్ పరిధిలో గల 220 చెరువుల వద్ద ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాం. ఆయా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఇన్చార్జ్లను నియమించుకొని, చెరువుల పండుగ విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచనలిచ్చాం. డప్పు వాయిద్యాలతో ప్రదర్శన, బోనాలు, బతుకమ్మ, వలల ప్రదర్శన, కట్ట మైసమ్మ, పూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని, చెరువుల ప్రాంగణాలను రంగవల్లులు, పూలతో ఆకట్టుకునే రీతిలో అందంగా ముస్తాబు చేయాలని పలువురు అధికారులకు తెలియజేశాం. ప్రతి చోట లైటింగ్ టెంట్లు, మైక్ సిస్టమ్, తాగునీరు, భోజన వసతి సదుపాయాలను పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాం.
– బన్సీలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇర్రిగేషన్ డివిజన్-1, రంగారెడ్డి జిల్లా