సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభించిన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నట్లు బీసీ గురుకులాల అడ్మిషన్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అయితే, ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వారితో ఈ మూడు గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఇంటర్మీడియట్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. వీటిలో ప్రవేశాల కోసం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం http://mjptbcwreis. telangana. gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. హైదరాబాద్ బాలురకు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో బాలికల కోసం బీసీ డిగ్రీ గురుకులాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి గురుకులంలో ఎనిమిది విభాగాలతో డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. వీటిలో ఆరు బీఎస్సీతో పాటు అనుబంధ కోర్సులు, బీబీఏ, బీకామ్, బీఏలోప్రత్యేక బ్రాంచ్లు.. బీఎస్సీలో కూడా ఎమర్జింగ్ కోర్సులను అందిస్తున్నారు. ప్రతి బ్రాంచ్లో 40 సీట్లు ఉంటాయన్నారు. ఒక్కొక్క గురుకుల డిగ్రీ కాలేజీలో 320 సీట్లు ఉన్నాయని తెలిపారు. మూడు గురుకులాల్లో 960 సీట్లు ఉన్నాయని రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు.