రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : పలు సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, పెండింగ్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియకు విన్నవించారు. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పరిష్కరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులే విధిగా ప్రజావాణికి హాజరు కావాలని, ఒకవేళ అత్యవసరంగా రాలేని పరిస్థితి ఉంటే జిల్లా పాలనాధికారి అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 60 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.