ధారూరు, జనవరి 2 : వైకుంఠధామాల్లో వసతులను కల్పించి సంక్రాంతిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అక్కడ నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ చాంబర్లో వైకుంఠధామాల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు 226 దరఖాస్తులు రాగా ఇప్పటికీ 118 పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వైకుంఠధామాల్లో విద్యుత్ సరఫరా నిమిత్తం అదనంగా కావాల్సిన స్తంభాలు ఇతర పనుల నిమిత్తం అంచనాలను రూపొందించి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణన్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ జయరాజు, డివిజినల్ పంచాయతీ అధికారులు అనిత, శంకర్నాయక్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.