ఇబ్రహీంపట్నం, మార్చి 3 : చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ.. తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను సీసీ కెమెరాల సాయంతో పట్టుకుని తీగ లాగితే.. 30 కేసుల్లో నిందితుడిగా తేలిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బుడ్డర గ్రామానికి చెందిన వడ్డె పోచయ్య దొంగతనాలే వృత్తిగా చేసుకుని గత ఆరు సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు.
గత నెల 25న రాత్రి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగుళూరు గ్రామంలోని కనకదుర్గ దేవాలయంలో 3 తులాల బంగారం చోరీకి పాల్పడ్డాడు. అమ్మవారి మెడలోని బంగారు పుస్తెలతాడుతో పాటు ఇతర నగలను ఎత్తుకెళ్లాడు. ఈ విషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన చోరీలన్నీ బయటకొచ్చాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధితో పాటు దుబ్బాక, సిద్దిపేట, తదితర జిల్లాల్లో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 30 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి బంగారం రికవరీ చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.