బండ్లగూడ, నవంబర్ 28 : నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే నగరవాసికి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి. ప్రతిరోజూ నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో పంచతంత్ర పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కులో నడక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో చిన్న చిన్న ఇసుక, రాళ్లు, నీళ్లు, గులక రాళ్లు వంటి వాటిని ఏర్పాటు చేశారు. దీంట్లో చెప్పులు వదిలి నడవడం ద్వారా పాదాలకు ఆక్యుపంచర్ జరిగి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మనిషి ఆరోగ్యానికి అనేక విధాలుగా దోహద పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు అనేక రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉండడంతో వ్యాయామానికి అనువుగా ఉంది. ప్రతి రోజూ ఇక్కడికి వాకింగ్కు వచ్చే వారు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ప్రతి రోజు 500 మంది వరకు పార్కుకు వస్తున్నారని నిర్వహణ సిబ్బంది నవీన్ తెలిపారు.