‘అనగనగా ఓ మారుమూల పల్లె.. ఆ పల్లెకు సమీపంలో ఓ పెద్ద మర్రిచెట్టు..’ అని పెద్దలు చెప్పే కథనాలు ఎన్నెన్నో.. అలాంటి ఓ పెద్ద మర్రిచెట్టు బొంరాస్పేట మండలంలోని మదన్పల్లి గ్రామ సమీపంలో ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్నది. పిల్లల మర్రిగా ప్రసిద్ధి చెందిన ఈ చెట్టుకు నాలుగు వందల ఏండ్ల నాటి చరిత్ర ఉండడం విశేషం. పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 24 : పిల్లల మర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని మనందరికీ తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలో కూడా అలాంటి పిల్లల మర్రే ఒకటి ఉన్నది. మండలంలోని మదన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న భారీ మర్రి చెట్టుకు శతాబ్దాల చరిత్రే ఉన్నది. ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ మర్రిచెట్టు మొదలు ఎక్కడ ఉన్నదో గ్రామస్తులే కాదు ఎవరూ గుర్తించలేరు. ఊడలు, ఊడలుగా విస్తరించి ఉన్న ఈ స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్లు, గ్రామానికి కిలో మీటరు దూరంలో సర్వే నంబర్ 66లో ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టుకు సుమారు నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్నదని గ్రామస్తులు చెబుతారు.
చెట్టు కొమ్మలు శాఖోప శాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ ఉన్నదో నేటికీ ఎవరూ గుర్తించలేకపోయారు. పూర్వ కాలంలో చెట్టుపై వందల సంఖ్యలో తేనె తెట్టెలు ఉండేవి. తెట్టెల నుంచి తేనెను తీయడానికి హైదరాబాద్ నుంచి వచ్చేవారని గ్రామస్తులు చెబుతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మర్రిచెట్టుకు సరైన ఆదరణ లేక ప్రాచుర్యంలోకి రాలేదు. గ్రామం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న చెట్టు వరకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. పట్టాదారు భూమిలో విస్తరించిన ఈ మర్రిచెట్టును గతంలో నరికేయడానికి ప్రయత్నించగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చెట్టును నరికే ప్రయత్నాలను నిలువరించారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మదన్పల్లి నుంచి మర్రిచెట్టు వరకు రోడ్డు సౌకర్యం కల్పించి మర్రిచెట్టు ఉన్న ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మర్రిచెట్టు కింద బాబన్సాబ్ దర్గా ఉన్నది. ఈ దర్గాకు చాలా మహత్యం ఉండేదని ప్రజలు చెబుతుంటారు. పూర్వకాలంలో బాబన్సాబ్ అనే వ్యక్తి గ్రామంలో కొలుపు (జాతకాలు) చెప్పేవాడని, ఆయన చనిపోతే ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతంలోనే సమాధి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. దర్గాకు సమీపంలో ఉన్న గుండానికి కూడా ప్రాధాన్యత ఉన్నది. గతంలో పీర్ల పండుగ సందర్భంగా ఊరేగింపులో వెలుతురు కోసం వెలిగించే దివిటీలపై ఈ గుండంలోని నీటిని పోస్తే అవి వెలిగేవని అంటారు. ఇప్పటికీ వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దర్గా వద్దకు వచ్చి కందూర్లు చేస్తారు. బాబన్సాబ్ దర్గా మహత్యం మూలంగానే మదన్పల్లి గ్రామంలో చాలా మందికి బాబయ్య అనే పేర్లు ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో బాబయ్య అనే పేరున్న వ్యక్తి తప్పక ఉంటాడు.