వెంగళరావునగర్, జనవరి 10 : కన్నబిడ్డ ఎంత ఆకలిగా ఉందో.. చనుబాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చుతా అనుమతించాలని ఓ తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్నది. బస్ చార్జీల కోసం బిడ్డలతో కలిసి భిక్షాటన చేస్తూ ఆ కుటుంబం ఆపరేషన్ స్మైల్ అధికారులకు చిక్కారు. ముగ్గురు చిన్నారులను వెంగళరావునగర్ డివిజన్లోని స్టేట్హోంలో అధికారులు చేర్పించారు. బిడ్డల కోసం తల్లిదండ్రులు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుటే ఐదు రోజులుగా పడిగాపులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం పగిడ్యాలకు చెందిన కప్పెరి ఎల్లప్ప, కప్పెరి నర్సమ్మ దంపతులు. వీరికి శైలజ (6), సంజు (4), వైశాలి (ఏడాది వయస్సు) సంతానం. ఎల్లప్ప శివరాంపల్లిలో నివాసముంటూ తాపీ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తమ ఊరికి వెళ్లిన కుటుంబసభ్యులు గత శుక్రవారం బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు దిగి నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భార్యాపిల్లలతో ఎల్లప్ప నడుచుకుంటూ మెహదీపట్నం రైతుబజార్ వద్దకు చేరుకున్నాడు. కింద పడేసిన కూరగాయలను ఏరుకుంటూ.. బస్సు చార్జీల కోసం భిక్షాటన చేస్తుండగా వారిని ఆపరేషన్ స్మైల్ అధికారులు పట్టుకున్నారు. శైలజ, సంజు, ఏడాది వయస్సున్న పాప వైశాలిని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న శిశు విహార్కు తరలించారు. దాంతో ఐదు రోజుల నుంచి కమిషనరేట్ గేటు ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్ కింద ఉంటూ పడిగాపులు కాస్తున్నారు ఆ దంపతులు.
ఐదు రోజుల క్రితం మా ముగ్గురు పిల్లల్ని స్టేట్హోంకు అధికారులు చేర్చారు. చివరి సంతానమైన ఏడాది వయస్సున్న కుమార్తె వైశాలికి పాలు ఇవ్వనివ్వడం లేదు. బిడ్డ ఎంత ఆకలితో ఉందో.. పాలిచ్చి ఆకలి తీర్చుతా.. అనుమతించాలని కనిపించినవారినల్లా కాళ్లావేళ్లాపడి వేడుకుంటున్నది ఈ మాతృమూర్తి. స్టేట్ హోం లోపలికి తమను రానివ్వడం లేదని.. బిడ్డల్ని చూసుకుంటానని.. తమ పిల్లల్ని తమకు అప్పగించాలని కోరినా ఆలకించేవారే కరువయ్యారని వాపోయింది. తాము భిక్షాటన వృత్తి చేసేవారంకాదని.. బస్సు చార్జీలు లేకే అడుక్కున్నామని.. కనికరించి కన్నబిడ్డలను అప్పగించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నది మాతృమూర్తి నర్సమ్మ.
బిడ్డలను చూసుకునేందుకు కన్నతల్లి నర్సమ్మను స్టేట్హోం లోపలికి అనుమతిస్తాం. ఏడాది వయస్సున్న కుమార్తె వైశాలికి తల్లిపాలు ఇచ్చేందుకు సహకరిస్తాం. ఇక్కడే ఆశ్రయం పొందే ఆమె ముగ్గురు బిడ్డలను కూడా ఆమె చూసుకోవొచ్చు. బిడ్డలతోపాటు తల్లి నర్సమ్మకు కూడా ఆశ్రయం కల్పిస్తాం. తదుపరి విచారణ కోసం కేసును రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తాం.
– చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజ