పెద్దేముల్, నవంబర్ 25: అడవి జంతువును వేటాడిన ఘటనలో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యమ్మ తెలిపారు. ఈ ఘటన బుధవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన ప్రకారం.. మండలంలోని ఎర్రగడ్డతండా గ్రామానికి చెందిన కొంతమంది ఈ నెల 23న బుధవారం ఉదయం గ్రామ శివారులోని చెరువు దగ్గర ఓ అడవి జంతువును వేటాడి మాంసాన్ని పంచుకున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
దీంతో ఆమె ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా ఎఫ్ఎస్వో మమత, సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోగా…అక్కడ మాంసాన్ని పంచుకుంటున్న దుండగులు అధికారులను చూసి పారిపోయారు. ఆ ప్రాంతంలో అడవి జంతువును కాల్చినట్లు రక్తపు మరకలు, చిన్న, చిన్న మాంసపు ముక్కలను అధికారులు గమనించారు. గ్రామంలో ని ఓ వ్యక్తి ఇంటిని పరిశీలించగా అక్కడ నాలుగు కేజీల జంతువు మాంసం లభ్యం కాగా ..అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు జంతువు మాంసాన్ని సీసీఎంబీ ల్యా బ్కు పంపించారు.
ఈ ఘటనకు సంబంధించి సుమారు రెండు రోజులపాటు లోతుగా దర్యాప్తు చేసి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అటవీశాఖ అధికారులు శుక్రవారం ఎర్రగడ్డతండాకు చెందిన సుమారు 17 మందిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పీఏఆర్ ప్రకారం 17 మంది వ్యక్తులతో కూడిన నివేదికను శుక్రవారం సాయం త్రం కోర్టులో సమర్పించారు. ప్రస్తుతం ఆ 17 మం ది నిందితులు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా దుండగులు వేటాడి చంపిన జంతువు ఏది అనేది సీసీఎంబీ రిపోర్టు వస్తే తెలియనున్నది.