సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇల్లే సహజ సిద్ధంగా చల్లగా ఉండేలా.. పగటి పూట లైట్లతో సంబంధం లేకుండా వెలుతురు ఉండేలా.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే.. విద్యుత్ ఆధాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని పలు నిర్మాణ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ హరిత భవనాల ప్రామాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
రోజురోజుకూ నలుదిక్కులా విస్తరిస్తున్న మహానగరం బహుళ అంతస్తుల భవనాలతో కాంక్రిట్ జంగిల్గా మారుతున్నది. ఒకవైపు నిరంతర అభివృద్ధి జరుగుతున్నా, మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నది. పర్యావరణ హిత ప్రాజెక్టులే లక్ష్యంగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) 2001లో ఏర్పాటైంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య( కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) అనుబంధ సంస్థగా మాదాపూర్లో దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం పర్యావరణహిత ప్రాజెక్టులను పెంచేందుకు ఐజీబీసీ కృషి చేస్తున్నది. వ్యాపార భవనం, నివాస గృహం, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, పరిశ్రమలు ఇలా ఐదు కేటగిరీల్లో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో హరిత భవనాలను నిర్మించారు. 2003లో మాదాపూర్లో నిర్మించిన సీఐఐ-ఐజీబీసీ భవనం ప్లాటినం రేటింగ్లో హరిత భవనంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత నివాస గృహం కేటగిరిలో జూబ్లీహిల్స్ రోడ్డు 78లో ఓ ప్రాజెక్టు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయం, టీ హబ్లకు గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు తెలంగాణలో పర్యావరణ హిత కేటగిరిలో మొత్తం 721 ప్రాజెక్టులు చేపట్టారు.
ప్రతి అపార్ట్మెంట్ అటవీ ప్రాంతం తలపించేలా..
ఆధునిక జీవనానికి సరికొత్త చిరునామాగా నిలిచేలా తమ కలల గృహం ఉండాలి.. రోజంతా ఉండే ఒత్తిడిని ఎదుర్కోవాలి.. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్ని అస్వాదించాలి.. ఇది ప్రస్తుత గ్రేటర్ వాసుల జీవనశైలి.. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో నగర వాసుల చూపు ఇప్పుడు హరిత భవనాల వైపు మళ్లింది. ఆహ్లాదం.. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హరిత భవనాల్లో తమ కలల గృహాన్ని ఎంతో ఇష్టపడి సొంతం చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే డెవలపర్లు చేపడుతున్న వర్టికల్ గార్డెన్ల కాన్సెప్ట్లు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. నగరం నుంచి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో దాదాపుగా 200లకు పైగా ప్రాజెక్టులు నమోదు చేసుకున్నాయి. పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించడం సవాల్గా మారిన పరిస్థితుల్లో ప్రతి అపార్ట్మెంట్ అటవీ ప్రాంతం తలపించేలా నిర్మాణాలతో ముందుకు రావడం శుభపరిణామని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే స్వచ్ఛమైన గాలి.. జీవన ప్రమాణాల పెంపు తదితర దీర్ఘకాలిక ప్రయోజనాలున్నా రాబోయే రోజుల్లో వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు మరింత ఆదరణ లభిస్తుందని రియల్టర్లు పేర్కొంటున్నారు.
గ్రీన్ బిల్డింగ్లతో ప్రయోజనాలు
గ్రీన్ బిల్డింగ్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఐటీ పార్కులు ఎక్కువగా వస్తున్నాయి. విండ్ ఎనర్జీ, వాటర్ హార్వెస్టింగ్, సోలార్ పవర్తో 40శాతం విద్యుత్ ఆదా, సూర్యకాంతి వీలుగా నిర్మాణాలు ఉంటాయి. ప్రధానంగా నీటి వృథా తగ్గిస్తారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు.
గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణానికి ప్రోత్సాహం
నగరంలో నిర్మించే భవనాలు, ఇతర ప్రాజెక్టులన్నీ హరిత భవనాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి నిర్మాణానికి హరిత భవన ప్రమాణాలు ఉండేలా సూచనలు చేస్తున్నాం. ఇలాంటి చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా హరిత భవనాల నిర్మాణం పెరిగేందుకు దోహదం చేస్తుంది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచం నేడు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యరహిత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. – సి.శేఖర్ రెడ్డి, చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్