వికారాబాద్, ఏప్రిల్ 24, (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది జిల్లాలో 61.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో రాష్ట్రస్థాయిలో జిల్లా 27వ స్థానంలో నిలిచింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ఇంటర్ ఫలితాల్లో 60 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 1.42 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే తగ్గడం గమనార్హం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయారు. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు, ఫీజు చెల్లింపునకుగాను మే 2 వరకు గడువు విధించినట్లు ఇంటర్బోర్డు అధికారులు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 15,506 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,947 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 6456 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా, 61.42 శాతం ఉత్తీర్ణతతో 3,965 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులైన బాలురకు సంబంధించి 3,010 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 63.50 శాతం ఉత్తీర్ణతతో 1,643 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. బాలికలకు సంబంధించి 3,446 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 68.25 శాతం ఉత్తీర్ణతతో 2,352 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానంలో నిలువగా, 53.11 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 6,455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 3,428 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 61.75 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా, 43.23 శాతంతో బాలురు పూర్తి వెనుకంజలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 3,443 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా, 2,126 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
3,012 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,302 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఒకేషనల్ ప్రథమ సంవత్సర ఫలితాలకు సంబంధించి మొత్తం 1,353 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 52.85 శాతం ఉత్తీర్ణతతో 715 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 36.95 శాతం ఉత్తీర్ణతతో 194 మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 828 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా, 62.52 శాతం ఉత్తీర్ణతతో 521 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సర ఫలితాలకు సంబంధించి జిల్లాలో 1,242 మంది పరీక్షలకు హాజరు కాగా, 67.55 శాతం ఉత్తీర్ణతతో 839 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 425 బాలురు పరీక్షలకు హాజరు కాగా, 43.76 శాతం ఉత్తీర్ణతతో 186 మంది బాలురు, 817 బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 79.93 శాతం ఉత్తీర్ణతతో 653 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.