రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది. మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, మరో 21 మంది స్వతం త్రులు బరిలో ఉన్నారు. నామినేషన్ల స్క్రూటినీ నాటికి 46 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..
నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు దూదేకుల ఇమామ్హుస్సేన్, మహ్మద్ చాంద్పాషాలు బరి నుంచి తప్పుకోవడంతో చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం రాజేంద్రనగర్ లోని ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సాధారణ పరిశీలకుడు రాజేందర్కుమార్ కటారియా ఈసీ మార్గదర్శ కాలను అనుసరించి అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ఒకే పేర్లతో వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తిని కలిగిస్తున్న ది. కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. అయితే కర్మన్ఘాట్కు చెందిన కొండా కాంతారెడ్డి కుమారుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరి పేర్లు..ఇంటి పేర్లు సైతం సేమ్ టూ సేమ్ ఉం డడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. దుండిగల్కు చెందిన ఆరోగ్యారెడ్డి కుమారుడు రంజిత్రెడ్డి గాదె రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను పోలిన పేర్లతో ఇతర అభ్యర్థులు రంగంలో ఉండడం.. ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నది.
చేవెళ్ల లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుంచి 25 వరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణలో మొత్తం 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 26న స్క్రూటినీ ప్రక్రియ పూర్తయ్యాక 18 మంది నామినేషన్లను తిరస్కరించడంతో బరి లో 46 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 23 మంది వివిధ జాతీయ, రాష్ట్రీయ గుర్తిం పు పొందిన పార్టీల నుంచి నామినేషన్లను దాఖలు చేయగా..మరో 23మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.
ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించడంతో కేవలం ముగ్గురు అభ్యర్థులే తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీన్నిబట్టి నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదని స్పష్టమవుతున్నది. వివిధ సెగ్మెంట్ల నుంచి పోటీలో ఉన్నవారు ప్రధాన పార్టీల అభ్యర్థులకు తెలియని వారే ఉండడంతో నామినేషన్లను ఉపసంహరించుకునేలా ప్రధాన పార్టీలు సైతం ఎటువంటి ప్రయత్నం చేయలేదని తెలుస్తున్నది.
ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటాతో కలిపి మొత్తం 16 మీటలుంటాయి. ప్రస్తు తం చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో అత్యధికంగా 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. వాస్తవానికి ఎక్కువ ఈ వీఎం యంత్రాలుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు, నిరక్షరాస్యులు గందర గోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ప్రధాన పార్టీ అభ్యర్థులకు వేయాల్సిన ఓట్లు పొరపాటున స్వతంత్ర అభ్యర్థులకు వేస్తే ఫలితం తారుమయ్యే పరిస్థితి. స్వతంత్ర అభ్య ర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెందిన గుర్తులను పోలీ ఉం డడం..ఈవీఎంలో అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వంటి ఘటనల నేపథ్యంలో గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓట్ల ఆధిక్యం తగ్గి ఓడిపోయిన సందర్భాలున్నాయి.