షాబాద్, ఏప్రిల్ 2 : తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రంజాన్ గిఫ్టు(తోఫా)లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారు. విందుల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు అందజేస్తున్నది. ఈ నెల 22న రంజాన్ పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 6వేల మందికి రంజాన్ గిఫ్టులు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని ఆయా గోదాంలలో కానుకలు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనుస్సుతో తమకు కానుకలు అందించడం సంతోషకరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
14 మండలాల్లో పంపిణీ
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాల్లోని ముస్లింలకు 6వేల గిప్ట్లు అందించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున గిఫ్టు(తోఫా)లు పంపిణీ చేయనున్నారు. ప్రతి గిప్ట్లో ఒక చీర, ఒక జాకెట్, ఒక పంజాబ్ డ్రస్ మెటీరియల్, లాల్చీ, పైజామా మెటీరియల్ ఉంటుంది. ఆయా మండలాల మసీదు కమిటీల ఆధ్వర్యంలో నిరుపేదలైన వారిని ఎంపిక చేసి అర్హులకు కానుకలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని కమిటీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి కానుకలు అందజేయనున్నారు.
ఇఫ్తార్ విందులకు రూ.12లక్షలు మంజూరు
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజా(ఉపవాసం)తర్వాత ఒక్క పొద్దు విడుస్తారు. వారికి ఇఫ్తార్ విందు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది. జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లోని పేద ముస్లింలకు మండలస్థాయి, నియోజకవర్గస్థాయిలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.12లక్షలు విడుదల చేసింది. ఇందులో చేవెళ్ల నియోజకవర్గానికి రూ.4లక్షలు, ఇబ్రహీంపట్నంకు రూ.4లక్షలు, షాద్నగర్కు రూ.4లక్షలు చొప్పున కేటాయించింది. ఆయా నియోజవర్గాల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు ద్వారా ఈ నిధులను సంబంధిత కమిటీల బ్యాంకు ఖాతాలో అధికారులు జమ చేయనున్నారు.
జిల్లాకు 6వేల రంజాన్ గిఫ్టులు వచ్చాయి;– ప్రవీణ్రెడ్డి, రంగారెడ్డిజిల్లా మైనార్టీ సంక్షేమాధికారి
జిల్లాకు 6వేల రంజాన్ గిఫ్టు(తోఫా)లు వచ్చాయి. ఇందులో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు 2వేల చొప్పున పంపిణీ చేయనున్నాం. లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రంజాన్ గిఫ్టులు అందజేస్తారు. దీంతోపాటు ఇఫ్తార్ విందుల కోసం నియోజకవర్గానికి రూ.4లక్షల చొప్పున రూ.12లక్షలు మంజూరయ్యాయి. మసీదు కమిటీల ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గాల్లో విందుల ఏర్పాటుకు నిధులు ఖర్చు చేయనున్నారు.