వికారాబాద్ జిల్లాలో ఆశాజనకంగా భూగర్భ జలాలు
గతేడాదితో పోలిస్తే పెరిగిన నీటి మట్టం
నవాబుపేట్లో 1.31 మీటర్లలోనే..
బావుల్లో సమృద్ధిగా నీరు
ఆనందంలో అన్నదాతలు
పరిగి, నవంబర్ 29 : సమృద్ధిగా వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది అధిక వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతోపాటు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భనీటి మట్టాలు అమాంతం పెరిగాయి. బోరుబావుల్లోనూ సమృద్ధిగా నీరు ఉండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కలిసొచ్చింది. చెరువులు, కుంటల పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు పెరుగడంలో కీలక భూమిక పోషించాయి. 2020 సంవత్సరం నవంబర్లో జిల్లాలో భూ ఉపరితలం నుంచి 7.40 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 7.18 మీటర్లలోనే ఉన్నాయి. నవాబుపేట్ మండలంలో కేవలం 1.31 మీటర్ల లోతులోనే నీరు ఉన్నది.
ఈసారి వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నవంబర్ నెలలో భూగర్భ జల మట్టం పెరిగింది. ప్రతీ సంవత్సరం వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతుండడంతో పంటల సాగుకు ఇబ్బంది లేకుండాపోతున్నది. 2019 నవంబర్ నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం 12.26 మీటర్లు ఉండగా.. 2020 నవంబర్లో 7.40, ఈసారి 7.18 మీటర్లు ఉన్నట్లు భూగర్భ జల వనరుల శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఈ గణాంకాలు వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈసారి భూగర్భ జలాలు పెరుగడం ద్వారా యాసంగి సీజన్లో పంటల సాగుకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు కురువడం వల్ల అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. మరోవైపు రోజుల తరబడి వరద నీటితో వాగులు ప్రవహించాయి. అక్టోబర్ 2021లో జిల్లాలో సరాసరి భూగర్భ జల మట్టం 5.88 మీటర్లు ఉండగా నవంబర్కు 7.18 మీటర్లకు చేరుకుంది. జిల్లా పరిధిలో నీటిమట్టం నవాబుపేటలో అత్యధికంగా 1.31 మీటర్లు ఉంది.