అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి జనాభా ఉన్న చోట కొత్తగా మినీ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండటంతోపాటు జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పదేండ్ల క్రితం ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటి పరిధిలో జనాభా, కుటుంబాలు పెరగడంతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా అధికారులు ప్రతిపాదనలు కూడా పంపించారు.
– ఆదిబట్ల, డిసెంబర్ 20
ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అదే లక్ష్యంతో నేడు అంగన్వాడీ కేంద్రాలను గిరిజన, ట్రైబల్ ప్రాంతాల్లో 300 మందికి పైగా జనాభా, మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పెండింగ్లో ఉన్న ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు.
1975 సంవత్సరంలో ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పడింది. వెయ్యి మంది జనాభా ఉన్న చోట ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పౌష్టికాహారం, అయిదేండ్లలోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నది. వెయ్యి జనాభాలోపు ఉన్న చోట మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదల, నివాస ప్రాంతాల విస్తరణ నేపథ్యంలో ఐసీడీఎస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మాతా, శిశు సంరక్షణ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త మినీ అంగన్వాడీ కేంద్రాలు, పాత మినీ కేంద్రాల అప్గ్రేడ్కు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం వెంటనే అమలు చేయడానికి సన్నాహాలు చేపడుతున్నది.
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పుడు 1,600 అంగన్వాడీ కేంద్రాలుండగా అందులో మొత్తం 1,31,630 మంది చిన్నారులకు విద్యతో పాటు ప్రభుత్వం వారికి పౌష్టికాహారం అందిస్తున్నది. ఇందులో 1,380 ప్రధాన కేంద్రాలు, 220 మినీ కేంద్రాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా 220 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచింది. మార్గదర్శకాల ప్రకారం జనాభా ఆధారంగా ఐసీడీఎస్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఈ ప్రతిపాదనలపై ప్రత్యేక చొరవ చూపుతున్నదని.. అతి త్వరలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మంత్రి అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి ఆ ఫైల్పై తొలి సంతకం చేశారు. వాటికి సంబంధించి గైడ్లైన్స్ వచ్చాయని ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు.
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం టీచర్ ఒక్కరే పని చేస్తున్నారు. వీటిని అప్గ్రేడ్ చేస్తే ప్రభుత్వం 220 మంది అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్లను కూడా నియమించనుంది. దీంతో కొందరికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రధాన కేంద్రాల్లో పనిచేసే టీచర్కు నెలకు వేతనం రూ 13,650 ఉండగా, మినీ కేంద్రాల్లోని టీచర్లకు రూ.7,800 మాత్రమే అందజేస్తున్నది. అప్గ్రేడ్ చేస్తే వీరి వేతనాలు కూడా పెరగనున్నాయి. దీంతో జిల్లాలో 220 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ఏర్పడనున్నాయి.
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషించదగ్గ విషయం. నేడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడం సంతోషకరం. ముఖ్యంగా మంత్రి తొలి సంతకం అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్ ఫైల్పై పెట్టడం ఎంతో సంతోషకరం. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తారు.
– కొత్త ఆర్తీక, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్
మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అడిగారు. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 220 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడానికి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దీంతో 220 కేంద్రాల్లో 220 మంది టీచర్లు, ఆయాలను కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం దీనిపై మాకు గైడ్ లైన్స్ సూచించింది.