రంగారెడ్డి జిల్లాకు మొత్తం 93 మంజూరు
మిగతావి త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు
పల్లె దవాఖానల్లో నెలరోజులుగా అందుతున్న వైద్యం
మొన్నటివరకు ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఉపకేంద్రాల నిర్వహణ
ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యులతో మెరుగైన సేవలు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 12 : గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నది తెలంగాణ సర్కార్. హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇదివరకు ఉన్న ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చుతున్నది. రంగారెడ్డి జిల్లాకు మొత్తం 93 దవాఖానలు మంజూరుకాగా.. ఇప్పటివరకు 22 అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ నెలరోజులుగా ఎంబీబీఎస్ డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్య సేవలందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లా అన్ని రకాల వైద్య సేవలను ఇక్కడ అందిస్తుండడంతో గ్రామీణ ప్రజలకు సైతం సమగ్ర వైద్యం చేరువైంది. మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలతో బాధపడుతున్నవారికి చికిత్స అందించడంతోపాటు అవసరమైన వారిని జిల్లా దవాఖానలకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి అవసరమైన మందులు అందించడంతోపాటు తగు సూచనలు చేస్తున్నారు. మరోవైపు మిగతా పల్లె దవాఖానలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. హైదరాబాద్లో బస్తీ దవాఖానల మాదిరిగా జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. దీంతో జిల్లాకు 93 పల్లె దవాఖానలు మంజూరయ్యాయి. జిల్లాకు మంజూరైన పల్లె దవాఖానల్లో ఇప్పటివరకు 22 పల్లె దవాఖానలు అందుబాటులోకి రావడంతోపాటు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలనందిస్తున్నారు. ఇప్పటికే ఉప కేంద్రాలుగా కొనసాగుతున్న వైద్యశాలలను పల్లె దవాఖానలుగా మారుస్తూ నిర్ణయించారు. ఉపకేంద్రాల్లో ఇప్పటివరకు కేవలం టీకాలు, తల్లీబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన పల్లె దవాఖానలు ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో పల్లె దవాఖానలుగా మారాయి. గత నెల రోజుల నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు పల్లె దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. పల్లె దవాఖానల ద్వారా సమగ్ర వైద్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లాలోని 93 ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా గుర్తించి పల్లె దవాఖానలుగా పేరు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లీబిడ్డలకు సంబంధించిన సేవలతోపాటు మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్సను అందిస్తున్నారు. అవసరమైన వారిని జిల్లా దవాఖానలకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలతోపాటు అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో పల్లె దవాఖానలు ప్రజలకు వైద్య సేవలనందిస్తున్నాయి. పల్లె దవాఖానలతో గ్రామీణుల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి 22 పల్లె దవాఖానలు
జిల్లాకు సంబంధించి యాచారం పీహెచ్సీ పరిధిలో 5 పల్లె దవాఖానలు, అబ్దుల్లాపూర్మెట్ పీహెచ్సీ పరిధిలో 14, బూర్గుల 7, చించోడ్ 9, దండుమైలారం 7, దుబ్బచెర్ల 9, కందుకూరు 9, మొయినాబాద్ 7, నందిగామ 5, కొందుర్గు 9, నర్కుడ 3, పెద్దషాపూర్ 4, తలకొండపల్లి పీహెచ్సీ పరిధిలో 5 పల్లె దవాఖానలు మంజూరయ్యాయి. పల్లె దవాఖానల ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యాన్ని అందిస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం;స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
జిల్లాలో 22 పల్లె దవాఖానలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గత నెల రోజుల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన అన్ని పల్లె దవాఖానల్లోనూ ఓపీ సేవలనందిస్తున్నారు. సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ముందే గుర్తించేందుకు పల్లె దవాఖానలు ఉపయోగపడనున్నాయి. ప్రతీ పల్లె దవాఖానకు ఎంబీబీఎస్ వైద్యులను నియమించాం. ప్రభుత్వ నిర్ణయంతో పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
పల్లె దవాఖానలతో అందుబాటులో వైద్య సేవలు
– డాక్టర్ శిరీష, పెద్దమంగళారం, మొయినాబాద్
ప్రభుత్వం గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు తెచ్చింది. ప్రతి రోజూ సేవలు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. గర్భిణులకు 9 నెలలపాటు వైద్య సేవలు అందించడంతోపాటు కాన్పు అయిన తరువాత 42 రోజులు పర్యవేక్షించి వైద్య సేవలు అందిస్తున్నాం. బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. పీహెచ్సీకి వెళ్లి వైద్య సేవలు పొందేవారు పల్లె దవాఖానకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ప్రజలకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాం.