స్వచ్ఛతలో 40 పాయింట్లకు 37 పాయింట్లు సాధించి రాష్ట్రంలో మూడో స్థానం పొందిన వికారాబాద్ జిల్లా
22 గ్రామాల్లో సర్వే చేసిన కేంద్ర బృందం
పరిగి, జనవరి 19 : పారిశుధ్యంలో వికారాబాద్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మూడో స్థానం దక్కింది. గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులు, రోడ్లు నిత్యం శుభ్రం చేయడం, చెత్త సేకరణ, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కేంద్ర బృందం చేసిన సర్వే ఆధారంగా వికారాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం దక్కింది. మొత్తం 40 పాయింట్లకు జిల్లాలో అమలు జరుగుతున్న పారిశుధ్య పనులు, పరిశుభ్రతకు 37 పాయింట్లు దక్కడం ద్వారా వికారాబాద్ జిల్లా ఈ ఘనత సాధించిందని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కేంద్ర బృందం జిల్లాలోని 22 గ్రామాల్లో నాలుగు రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లాకు ర్యాంకింగ్ ఇచ్చింది. గత డిసెంబర్ 28 నుంచి 31 వరకు కేంద్ర బృందం సభ్యులు జిల్లాలో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా జిల్లాకు మూడో స్థానం దక్కినట్లు జిల్లా ఉన్నతాధికారులకు కేంద్ర అధికారుల బృందం సమాచారం అందించింది.
ప్రతి అంశం ఫొటోతోపాటు జియో ట్యాగింగ్
వికారాబాద్ జిల్లా పరిధిలోని 22 గ్రామాల్లో డిసెంబర్ 28 నుంచి 31 వరకు సర్వే చేసిన కేంద్ర బృందం సభ్యులు వారు పరిశీలించిన ప్రతి అంశాన్ని ఫొటో తీయడంతోపాటు జియో ట్యాగింగ్ చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 10 కుటుంబాలను ఈ సర్వేకు ఎన్నుకున్నారు. చిన్న గ్రామాల్లో సర్వే చేసే కుటుంబాల మధ్య 20 కుటుంబాలుండేలా, పెద్ద గ్రామాల్లో వంద కుటుంబాలకు ఒకటి చొప్పున సర్వే చేపట్టారు.
పలు అంశాల పరిశీలన
కేంద్ర బృందం సభ్యులు నిర్వహించిన సర్వేలో పలు అంశాలను స్వయంగా పరిశీలించారు. ప్రధానంగా మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మురికికాలువల నిర్మాణం, ఇండ్లల్లో తడి, పొడి చెత్తకు వేర్వేరు డబ్బాలు ఉన్నాయా అని పరిశీలించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామపంచాయతీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లలోని మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారా, వాటి నిర్వహణ పరిశీలించారు. ఇంకుడుగుంత లేకుంటే మురికినీరు వెళ్లేందుకు డ్రైనేజీ సదుపాయం ఉన్నదా అని వాకబు చేశారు. మురికికాలువల్లో సిల్ట్ తొలగింపు, రోడ్లు తరచుగా శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ జరుగుతుందా, ఎన్ని రోజులకోసారి చెత్త సేకరణ జరుగుతుంది తెలుసుకోవడంతోపాటు కంపోస్టు షెడ్లు సైతం వారు పరిశీలించారు. వాటితోపాటు పారిశుధ్యం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అన్ని గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించారా, తద్వారా అవగాహన కల్పించారా అని తెలుసుకోవడంతోపాటు వాటి ఫొటోలు తీసుకున్నారు.
37 పాయింట్లు సాధించిన జిల్లా
సర్వే సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు 40 పాయింట్లకుగాను తాము పరిశీలించిన పారిశుధ్య పనులు, రోడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా వాల్ పెయింటింగ్స్తోపాటు ఆయా కుటుంబాల వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పాయింట్లు కేటాయించారు. సర్వే సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా పాయింట్ల కేటాయింపు జరపగా వికారాబాద్ జిల్లాకు 37 పాయింట్లు వచ్చాయి. తద్వారా పారిశుధ్యంలో వికారాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని జిల్లా అధికారులకు సమాచారం అందించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ, ఇతర కార్యక్రమాలు చక్కగా అమలు చేస్తుండడంతోనే వికారాబాద్ జిల్లాకు ఈ స్థానం దక్కింది.