వికారాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గతనెల మొదటి వారం వరకు రోజుకు 10 వేల మంది పనులకు రాగా, ఈనెల మొదటి వారం నుంచి ఉపాధి పనులకు వచ్చే వారు గత నెలతో పోలిస్తే 11 వేలకుపైగా పెరిగారు. దీంతో జిల్లాలో రోజుకు 21,611 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వ్యవసాయ పనులు పూర్తి కావస్తుండడంతోనే కూలీల సంఖ్య పెరుగుతున్నదని, ఈ నెలాఖరులోగా వారి సంఖ్య 30 వేల వరకు చేరొచ్చని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అగ్రికల్చర్ పనులు పూర్తి కావస్తున్న దృష్ట్యా భూములను చదును చేసే పనులతోపాటు మట్టి రోడ్లు, నీట ఊట గుంతల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర పనులు సాగుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 59.31 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 49.92 లక్షల పని దినాలను అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజుకు రూ.194 కూలి అందజేస్తున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 1,83,309 జాబ్కార్డులు ఉండగా, 3,77,087 మంది కూలీలు ఉన్నారు.
పెద్దేముల్లో రోజుకు 2,265 మంది కూలీలు..
జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. పెద్దేముల్ మండలంలో రోజుకు 2,265 మంది కూలీలు, కులకచర్ల మండలంలో 1626మంది, యాలాల మండలంలో 1432 మంది, నవాబుపేట మండలంలో 1283మంది, మర్పల్లి మండలం లో 1391మంది, కోట్పల్లి మండలంలో 1263మంది, పరిగి మండలంలో 1297మంది, పూడూరు మండలంలో 1131మంది, మోమిన్పేట మండలంలో 1173మంది, దౌల్తాబాద్ మండలంలో 1183 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు ఇప్పటివరకు రూ.92.93కోట్లు చెల్లించారు. మరోవైపు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడుగుంతలు, నీటిఊట గుంతలు, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అంతేకాకుండా అసైన్డ్ భూముల్లోని రాళ్లను తొలగించ డం, భూమిని చదును చేయడం, బౌండ్రీల ఏర్పాటు, బోరుబావులను తవ్వించడం తదితర పనులను చేపట్టనున్నారు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టికట్టలు, భూఉపరితల నీటి గుంతల నిర్మాణం, పశువులకు షెడ్ల ఏర్పాటు, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు.
2,383 కుటుంబాలకే వంద రోజులు..
గతంలో ప్రతి ఏటా ప్రతి కుటుంబానికీ వంద రోజుల పనిని కల్పించేవారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 45 రోజుల గడువున్నా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో 2,383 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కల్పించలేకపోయారు. రెండేండ్ల క్రితం వరకు జిల్లాలో ప్రతి ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజుల వరకు పనిని కల్పించగా.. రెండేండ్లుగా వంద రోజుల పనిని పొందే కూలీల సంఖ్య మూడు వేలకు పెరుగకపోవడం గమనార్హం. కొడంగల్, నవాబుపేట, పూడూరు, వికారాబాద్, దోమ, మర్పల్లి, పెద్దేముల్, మోమిన్పేట, బంట్వారం బొంరాస్పేట మండలాల్లో మాత్రమే 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 8 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్లోనే కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. అయితే కోట్పల్లి మండలంలో అత్యల్పంగా కేవలం 20 కుటుంబాలకు మాత్రమే వంద రోజులపాటు పనిని కల్పించడం గమనార్హం. కులకచర్ల మండలంలో 25 కుటుంబాలకు, యాలాలలో 35 కుటుంబాలకు, తాండూరులో 33 కుటుంబాలకు, బషీరాబాద్లో 64 కుటుంబాలకు, దౌల్తాబాద్లో 37 కుటుంబాలకు, పరిగిలో 42 కుటుంబాలకు, ధారూరు మండలంలో 44 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు.