వికారాబాద్, జనవరి 13 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకునేలా చక్కటి ప్రణాళికతో అధికారులు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని కలెక్టర్ నిఖిల మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు, వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులతో, ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులను రెండు వారాల్లో అందించాలని సూచించారు. ఇతర కంటి సమస్యలకు తాండూరులోని ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేసి, అవసరమైన చికిత్సలు అందించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీల్లో 42 వైద్య బృందాలతో కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో 8 మంది సభ్యులతో వైద్య బృందం ఉదయం 9 గంటలకు శిబిరానికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో తరుణ్కుమార్ పాల్గొన్నారు.