బొంరాస్పేట, ఫిబ్రవరి 10 : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చేవారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 5800 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1172 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 885 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 80 గ్రామాలు, 25 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి రవీంద్రయాదవ్ కోరారు. సోమవారం మండలంలోని సాలిండాపూర్లోని కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి లోపం ఉన్నవారికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి హేమంత్, వైద్యుడు గోపాల్, సీహెచ్వో శివరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
జోరుగా కంటి పరీక్షలు
షాబాద్, ఫిబ్రవరి 13 : పేదలకు తెలంగాణ కంటి వెలుగు పథకం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు వస్తున్న ప్రజలకు వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి కండ్లద్దాలు, మందులు అందజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం 80 బృందాల ద్వారా కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. జిల్లాలో 17,375 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటలకే వైద్యబృందాలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకుంటున్నాయి. ప్రజల ఆధార్కార్డు తీసుకుని పేర్లు రిజిస్టర్ చేసిన వెంటనే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితోపాటు, డివిజన్స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు.
జిల్లాలో 17,375 మందికి కంటి పరీక్షలు
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 17,375 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,390 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 1,940 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గతంలో కంటి సమస్యలతో ఎన్నో దవాఖానలు తిరిగినా సమస్య తీరలేదని, సీఎం కేసీఆర్ తమ గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి కంటి పరీక్షలు చేయడం సంతోషకరమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
– చంద్రయ్య, శంకర్పల్లి
కంటి వెలుగును ప్రారంభించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో చూపించుకునే స్థోమత ఉండదని గ్రహించి కంటి వెలుగును ప్రారంభించడం అదృష్టం. కంటి పరీక్షలు చేసి అక్కడే అద్దాలు ఇస్తుండ్రు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టిన కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలి.