రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరు సాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ల బలం ఎక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ధీమాగా ఉన్నది. ఇదే స్థానంపై గెలుపు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపింది. ఈ నేపథ్యంలో ఓటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ఎవరికివారు క్యాంపులకు తరలించారు. ఈనెల 28న జరుగనున్న ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నుంచి 171 మంది ఓటింగ్లో పాల్గొననున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త మన్నె జీవన్రెడ్డిలు బరిలో ఉన్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న సుదర్శన్గౌడ్ ప్రభావం నామ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికలో ఓటమి ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడనుండడంతో అధికార పార్టీ కాంగ్రెస్కు గుబులు పట్టుకున్నది. మెజార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో ఓటమి ఖాయం అనుకున్న కాంగ్రెస్… బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నది.
బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు గాలం వేసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. డబ్బులను ఎరగా చూపడం.. లేదంటే ! బలప్రయోగానికి, అధికార దుర్వినియోగానికి సైతం పాల్పడేందుకు పూనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీలు ఓటర్లను క్యాంపులకు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నది. ఈనెల 28న ప్రజాప్రతినిధులను నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓటర్లు ప్రభావం చూపనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో జడ్పీటీసీలు 83 మంది, ఎంపీటీసీలు 888 మంది, మున్సిపల్ కౌన్సిలర్లు 449 మంది, ఎక్స్ ఆఫీషియో సభ్యులు 19 మంది ఉన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల తర్వాత అత్యధికంగా 171 మంది ఓటర్లు షాద్నగర్ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడెం, నందిగామ మండలాల సభ్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు. సంఖ్యాపరంగానూ ఇందులో మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు.
వీరంతా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీఆర్ఎస్కు మెజార్టీ సభ్యుల బలం ఉండగా.. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రస్తుతం అన్నివర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు అనుకూలించే అంశాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపును చేపట్టనుండగా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.