ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు రూ.2వేల కోట్ల ‘సాయం’
రైతుల సంక్షేమమే లక్ష్యం
విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి
బంట్వారం, నవాబుపేటల్లో ఘనంగా రైతుబంధు సంబురాలు
పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ
బంట్వారం, జనవరి 12 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రైతుబంధు సాయంతో ప్రతి రైతు ఇల్లు కళకళలాడుతున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం బంట్వారంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. పెట్టుబడి సాయం అందుకున్న రైతుల కండ్లల్లో ఆనందం కనబడుతున్నదన్నారు. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు రూ.2వేల కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. సకాలంలో డబ్బులు అందుతుండడంతో రైతులు ఏ చింతా లేకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారన్నారు. అలాగే నవాబుపేటలో జరిగిన సంబురాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ.2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం ‘రైతు బంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల అకౌంట్లలో నేరుగా వ్యవసాయ పెట్టుబడులను జమ చేస్తున్న మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందుకు రైతుబంధు నిదర్శనమని చెప్పారు. రైతులు చేస్తున్న సంబురాలను చూస్తే ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్లుందని చెప్పారు. రైతు బాంధవుడు, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు రైతులు వేడుకలు చేసుకుంటూ ముఖ్యమంత్రికి దన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. గతంలో రాష్ట్రంలో కరెంటు కష్టాలతో చీకట్లో గడిపిన పరిస్థితి ఉండేదని, కేసీఆర్ నిరంతర కరెంటు ఇస్తామంటే ప్రతి పక్షాలు ఎద్దేవా చేశాయన్నారు. ఇప్పుడు 24గంటలు విద్యుత్ను ఇస్తుంటే ప్రతి పక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గత పాలకుల పాలనతో తెలంగాణ ప్రాంతంలోని చెరువులు చుక్కనీరు లేక ఎండిపోయాయని, మిషన్ భగీరథతో నేడు చెరువులన్నీ నిండి చేపలు పెంపకం చేపట్టినట్లు చెప్పారు.
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సంక్షేమ పథకాలను అడ్డుకోలేరని చెప్పారు. రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన సీఎం కేసీఆర్ను యావత్ దేశ రైతాంగం ప్రశంసిస్తున్నదన్నారు. రాష్ట్ర రైతుల కోసం నిరహార దీక్ష చేపట్టి.., పంటలను కొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడిన మహానేత కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ రైతాంగానికి ఉచిత కరెంటు, విత్తనాలు, రైతుబీమా, సాగు నీరు అందిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.10,500 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష కోట్లు, రైతుల రుణమాఫీ కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పటి వరకు రూ.3535 కోట్లను రైతుబీమా కోసం రూ.70వేల రైతు కుటుంబాలకు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులను మంత్రి, ఎమ్మెల్యే సన్మానించారు. అంతకుముందు మండలానికి చేరుకున్న మంత్రికి రైతులు, నాయకులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములుయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజాపాషా, ఆయా గ్రామాల సర్పంచ్లు నర్సింహులు, నర్సింహారెడ్డి, లావణ్య, ఉమాదేవి, ఎంపీటీసీలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధారూరులో..
ధారూరు, జనవరి 12 : గతంలో వ్యవసాయం అంటే దండుగన్న రైతులను నేడు రాష్ట్రంలో పండుగ చేసిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి అన్నారు. బుధవారం ధారూరు మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా రైతులు సంబురాలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ తీశారు. బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడారు. కార్యక్రమంలో ధారూరు వైస్ ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్ ధారూరు మండల అధ్యక్షుడు రాజునాయక్, ఏఎంసీ చైర్మన్ సంతోశ్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు ఎస్.వెంకటయ్య, వ్యవసాయశాఖ మండల అధికారి జ్యోతి, వ్యవసాయ విస్తరణ అధికారులు సంజీవ్రాథోడ్, మల్లేశం, హరి ప్రసాద్, శ్రీకాంత్, భవాని, యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, నాయకులు కావలి అంజయ్య, యూనుస్, హఫీజ్, రామచంద్రయ్య, లక్ష్మయ్య, చిన్నయ్యగౌడ్, గొవింద్రాజ్గౌడ్, చెన్నయ్య, చాకలి లక్ష్మయ్య, పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.