HomeRangareddy125 Grain Purchase Centers In Vikarabad District
లక్ష్యానికి చేరువలో
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది.
వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
తుది దశకు ధాన్యం సేకరణ
ఇప్పటివరకు 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి
ఇంకా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం
17,451 మంది రైతులకుగాను రూ.201 కోట్లను చెల్లించేందుకు చర్యలు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1.34 లక్షల ఎకరాలు
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది. ఇందుకు రూ.201 కోట్లను రైతులకు చెల్లించేందుకు జిల్లాయంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. ఈ వానకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 75 వేల మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం మినహా ఇంకా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల్, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో అధికంగా వరి సాగైంది.
– వికారాబాద్, జనవరి 3, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వానకాలం సీజన్కు వరి ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లక్ష మెట్రిక్ టన్నుల వరకు చేరుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లావ్యాప్తంగా 125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో ఇప్పటివరకు 97,487 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలోని మెజార్టీ రైతులు ధాన్యాన్ని విక్రయించడంతో పలు కేంద్రాలకు వారం రోజులుగా ధాన్యం రాకపోవడంతో జిల్లావ్యాప్తంగా 54 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. జిల్లాలోని కొన్ని చోట్ల మాత్రమే రైతుల వద్ద ధాన్యం ఉన్న దృష్ట్యా మరో వారం, పది రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కానున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు వెంటనే చెల్లింపులను చేసేందుకు వీలుగా ప్రభుత్వం డబ్బులను కూడా పౌరసరఫరాల శాఖ వద్ద సిద్ధంగా ఉంచింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్మిల్లులకు సరఫరా చేసి బిల్లులు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మద్దతు ధరకు సంబంధించి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.2060, సాధారణ రకం రూ.2040గా నిర్ణయించింది. జిల్లాలో వానకాలం సీజన్కు 75 వేల మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మెజార్టీ రైతులు ధాన్యాన్ని విక్రయించిన దృష్ట్యా మరో 30 వేల మెట్రిక్ టన్నుల మేరకు మాత్రమే ధాన్యం వచ్చే అవకాశాలున్నాయని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు 97,601 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి
జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 58, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, ఏఎంసీ ఆధ్వర్యంలో 7, ఐకేపీ ఆధ్వర్యంలో 29, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో ఇప్పటివరకు 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటివరకు రూ.201 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా.. వీటిలో ఏ గ్రేడ్ రకం 97,487 మెట్రిక్ టన్నులు కాగా, సాధారణ రకం 113 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
ఇప్పటివరకు 96,042 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించగా, మిగతా 1558 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో 59 గోదాంలలో ధాన్యాన్ని నిల్వ చేసే ఏర్పాట్లను నాలుగు ఏజెన్సీలకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. ఈ వానకాలం సీజన్లో రైతులు ఎక్కువగా పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో 1.34 లక్షల ఎకరాల్లో చేపట్టారు.
సత్వరమే చెల్లింపులు : కలెక్టర్ నిఖిల
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటివరకు సేకరించిన రూ.201 కోట్ల చెల్లింపులకు సంబంధించి ధాన్యాన్ని విక్రయించే రైతులెవరికి కూడా ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాం.