రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీ పండుగలా సాగుతున్నది. సెప్టెంబర్ 5 వ తేదీన ప్రక్రియ ప్రారంభమవ్వగా.. మరో 10 రోజుల్లో పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. 126 మత్స్యకార సొసైటీల ఆధ్వర్యంలోని మొత్తం 1000 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి జిల్లావ్యాప్లంగా 1.70కోట్ల చేపపిల్లలను అందజేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఒకేరోజు 8 లక్షల చేపపిల్లలను విడిచిపెట్టగా.. ఆయా మండలాల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమం జోరందుకున్నది.
-ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 8
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 8 : మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లాలోని మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండల పరిధిలోని గ్రామాల్లో చేపపిల్లలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించారు. మరో 10 రోజులపాటు ఉచిత చేపపిల్లల పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి.
జిల్లాలో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో 126 సొసైటీలను ఏర్పాటుచేశారు. ఈ సొసైటీల ఆధ్వర్యంలో సుమారు 1000 చెరువులను ఇప్పటికే గుర్తించారు. ఈ చెరువుల్లో సుమారు 1.70 కోట్ల చేపపిల్లలు అవసరమని గుర్తించారు. ఇందుకోసం అవసరమైన చేపపిల్లలను ప్రభుత్వం ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు చేర్చింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సమీపంలోని చేపపిల్లల పెంపకం కేంద్రంవద్ద ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, మాడ్గుల తదితర మండలాలకు ఒక్కో రోజు ఒక్కో మండలానికి చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కూడా చేపపిల్లల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఒకే రోజు 8 లక్షల చేపపిల్లలను విడిచిపెట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా మరో పది రోజుల్లో చేపపిల్లల పంపిణీ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
బొచ్చలు, రవ్వలు, బంగారు తీగలు పంపిణీ
మత్స్య సహకార సొసైటీల కోరిక మేరకు బొచ్చలు, రవ్వలు, బంగారు తీగల జాతి చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో 60లక్షల బొచ్చలు, 60లక్షల రవ్వలు, 50లక్షల బంగారు తీగలు, 10లక్షల మీగ్రాల్ జాతి చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. ఈ చేపపిల్లలు ఆరు నుంచి 8 నెలల వ్యవధిలో పెరిగి పెద్దవి కానున్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 నెలల్లో ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన చేపలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామపంచాయతీల్లో మత్స్యకారుల కోరిక మేరకు అదనంగా చెరువులను గుర్తించి అవసరమైన చేపపిల్లలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి
ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తుండటంతో మత్స్యకారులు పోటీపడి చేపపిల్లలను తీసుకుపోయి పెంచుతున్నారు. పెరిగిన చేపల ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రావిర్యాల, లింగంపల్లి సాబిత్నగర్ చెరువు, చింతపట్ల కాముని చెరువు, రాయపోల్ రెయిన్ చెరువు, ఆరుట్లలోని పడమటి చెరువు, ముదిరెడ్డి చెరువు, చిన్నబంధం, పెద్దబంధం చెరువులతో పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో పెద్ద చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపిపల్లలను విడిచిపెట్టారు.
ప్రభుత్వ కృషి అభినందనీయం : వెంకటేశ్, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం
ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేసి.. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించటం ఎంతో సంతోషం. గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
మత్స్యకారులకు పెద్దపీట : గోరెంకల నర్సింహ, మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు
గత సీమాంధ్ర పాలకుల హయాంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. జీవనోపాధి లేక ఇబ్బందులకు గురయ్యాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువు, కుంటల్లో నీరు పుష్కలంగా చేరడంతోపాటు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తున్నది. దీంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరకడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
మరో పదిరోజుల్లో పంపిణీ పూర్తి : ఏసుదాసు, మత్స్య సహకార సంఘం అధికారి
నిర్ణీత గడువులోపల ప్రభుత్వం కేటాయించిన చేపపిల్లలన్నింటినీ మత్స్యకార సొసైటీలకు అందజేస్తాం. చేపపిల్లల పంపిణీ జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా 1.70కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీటన్నింటినీ సకాలంలో మత్స్యకార సొసైటీల ద్వారా గ్రామాల్లోని చెరువుల్లో వదిలిపెడుతున్నాం.