రంగారెడ్డి, జనవరి 25(నమస్తే తెలంగాణ): జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నాయి. 21 మండలాల పరిధిలోని 558 గ్రామపంచాయతీలకు దాదాపు రూ.115కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల చేయనున్నది. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనది. గ్రామ పంచాయతీల్లో పనుల ప్రాధాన్యతను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. త్వరలో మండల, జిల్లా స్థాయిల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టి ఫిబ్రవరి 20 నాటికి ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో పూర్తి వివరాలను నమోదు చేయనున్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా నిధులను విడుదల చేస్తుంటాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అందజేస్తుండగా.. చిన్న గ్రామపంచాయతీలకు సంవత్సరానికి కనీసం రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు వస్తున్నాయి. పెద్ద పంచాయతీలకు రూ.40లక్షల వరకు విడుదల అవుతున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతి సంవత్సరం పంచాయతీలకు నిధులను అందిస్తున్నది. దీనికితోడు పంచాయతీలకు వివిధ పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతున్నది. అయితే ఈ నిధులను పాలకవర్గాలు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నాయి. అవసరం లేని పనులకు నిధులను ఖర్చు చేస్తుండడంపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ తరహా అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రణాళికలో పేర్కొన్న పనులకే 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.
తొమ్మిది అంశాలతో గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మెరుగైన జీవనోపాధి, నీటి వసతి, పచ్చదనం, పరిశుభ్రత, స్వయంసమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత, మహిళల సాధికారత, పంచాయతీల్లో సుపరిపాలన వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే జీపీల్లో ముసాయిదా అభివృద్ధి ప్రణాళిక(డ్రాప్ట్ జీపీడీపీ) రూపకల్పనకు సంబంధించి గ్రామ సభలు జరుగుతున్నాయి. పంచాయతీ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామ సభలో గుర్తించిన పనుల వివరాలను ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయనున్నారు.
మండల స్థాయిలో బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(బీపీడీపీ) నోడల్ అధికారిగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారు. రూ.6,54, 61,613 లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికను అన్ని శాఖల భాగస్వామ్యంతో రూపొందించి ఫిబ్రవరి 7 నాటికి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఆమోదిస్తారు. 10వ తేదీలోపు పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేస్తారు. అలాగే.. ఫిబ్రవరి 16లోపు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(డీపీడీపీ)ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి నోడల్ అధికారిగా జడ్పీ సీఈవో వ్యవహరిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3,27,30,807లతో చేపట్టే అభివృద్ధ్ది పనులకు సంబంధించి ప్రణాళికలపై చర్చించి జడ్పీ సమావేశంలో ఆమోదం తెలుపుతారు. ఆ వివరాలను ఫిబ్రవరి 20లోపు పోర్టల్లో నమోదు చేస్తారు.