వికారాబాద్, డిసెంబర్ 15 : మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీవోలతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 నుంచి 15 ఏండ్లలోపు పిల్లలందరికీ సంబంధిత శాఖల సహకారంతో జేఈ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 5 ఏండ్ల పిల్లల వివరాలు, 6 నుంచి 15 ఏండ్ల పిల్లల పూర్తి వివరాలు వెంటనే అందజేయాలన్నారు. ఐదేండ్లలోపు పిల్లలకు కుడి చేతికి టీకాలు ఇస్తారని తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితమైనదని పేర్కొన్నారు.
ప్రతి రోజూ ఒక ఏఎన్ఎం 100 మంది పిల్లలకు టీకాలు వేసేలా చూడాలని ఆదేశించారు. పిల్లల తల్లిదండ్రులకు జేఈ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారి జీవరాజ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, వైద్యశాఖ స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.