కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది. గతంతో పోలిస్తే జిల్లావ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా వంద రోజులు పని పూర్తి కాకపోవడం బాధాకరం. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్నా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 880 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. మెటీరియల్ కాంపొనెంట్ నిధుల్లోనూ కోతలు విధిస్తూ కేంద్రం పేదల పొట్ట కొడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం 63.87 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 43.77 లక్షల పని దినాలు మాత్రమే పూర్తయ్యాయి. – వికారాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, సెప్టెంబర్ 22 , (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో కొత్త విధానాలను తీసుకువచ్చి ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉపాధి హామీ తనిఖీల పేరిట పలు జిల్లాల్లో పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్ట్లతో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర చేశాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గినప్పటికీ ఉపాధి హామీ పథకానికి అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ కుట్రలతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. మరోవైపు కేంద్రం నిర్ణయాలతో గతేడాది నుంచి ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తూ వస్తున్నారు. రెండేండ్లలో 40 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.03 లక్షల పనిదినాలను కల్పించగా, గతేడాది ఏకంగా 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం 63.87 లక్షల పనిదినాలు టార్గెట్ కాగా, ఇప్పటి వరకు 43.77 లక్షల పనిదినాలు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కూడా కల్పించలేకపోయారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్న ఇప్పటివరకు కేవలం 880 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ప్రతి ఏటా 20వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత రెండేళ్లుగా వంద రోజుల పని పొందే కూలీల సంఖ్య రెండు వేలకు కూడా పెరుగకపోవడం గమనార్హం. జిల్లాలోని వికారాబాద్, కొడంగల్ మండలాల్లో మాత్రమే 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 16 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. కోట్పల్లి మండలంలో అత్యల్పంగా కేవలం రెండు కుటుంబాలకు మాత్రమే వంద రోజులపాటు పనిని కల్పించడం గమనార్హం.
యాలాల మండలంలో ఆరు కుటుంబాలకు, కులకచర్ల మండలంలో ఏడు కుటుంబాలు, బషీరాబాద్ 11, పరిగి, పెద్దేముల్లో 12 , దౌల్తాబాద్ 13, తాండూరు 14, ధారూరు 17 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా జాప్యం జరుగుతున్నాయి.