తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ధాన్యం కొనుగోలులో ద్వంద్వ వైఖరి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఆమనగల్లులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ఆమనగల్లు, నవంబర్ 8 : ఎన్ని అడ్డంకులొచ్చినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్నారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతులు యాసంగిలో వరి సాగు చేయకూడదన్నారు. ప్రభుత్వం వందేండ్ల దూర దృష్టితో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నదన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు రైతాంగానికి కానుకగా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడి ్డనిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 ప్రకారం దేశంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తప్పనిసరిగా కేంద్రం కోనుగోలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా అని అయన నిలదీశారు. ఏడేండ్ల పాలనలో ప్రపంచం అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షచూపుతూ అభివృద్ధికి అడ్డం పడుతున్నదన్నారు. సోమవారం ఆమనగల్లులో రూ.20లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవన నిర్మాణం, రూ.కోటితో మోడల్ గ్రంథాలయ భవనం, వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.4.50కోట్లతో సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సంక్షేమ, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు వందేండ్ల దూరదృష్టితో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై భారం మోపేలా డీజిల్, పెట్రోల్పై ధరల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నదని ఎద్దేవా చేశారు. వానకాలం సాగులో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రాసిన లేఖను దాచిపెట్టి తెలంగాణ రైతులను తప్పుదోవపట్టించేలా కొత్త డ్రామాలు ఆడుతూ రైతులను ఆగం చేస్తున్నట్లు చెప్పారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రానికి కంటగింపుగా ఉంది..
రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుత పథకాలను చూసి కేంద్రానికి కంటగింపుగా ఉందన్నారు. సాక్షాత్తు నీతిఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటించి సాగునీటి జలాలు, చెరువులు, కుంటలు, నీటి సంరక్షణపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించి రూ.24వేల కోట్ల నిధులను తెలంగాణకు విడుదల చేయాలని లేఖ రాస్తే కేంద్రం పట్టించుకోలేదన్నారు. విచిత్రంగా రాష్ట్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై కేసీఆర్పై లడాయికి దిగుతున్నారని.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ అదిరేది లేదు బెదిరేది లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసులు వేసి కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. పట్టణంలో అభివృద్ధి పనులకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. త్వరలోనే ఆమనగల్లులో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు గ్రంథాలయ భవన నిర్మాణాలకు కృషిచేస్తామన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ.. ఆమనగల్లు మండల ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఆమనగల్లు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలబడాలని కోరారు.
ఆమనగల్లు పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. ఆమనగల్లు పట్టణ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాన్నారు. ఆమనగల్లు పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే ప్రతిపక్షపార్టీల నాయకులు ఓర్వలేకపోతున్నట్లు చెప్పారు. రీజినల్ రింగ్రోడ్డు ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాల గుండా వెళ్తుండటంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఆస్కారం ఉంటుందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. ఆమనగల్లు బ్లాక్ మండలాలకు జడ్పీ నుంచి అధికంగా నిధులు మంజూరు చేసి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, విజితారెడ్డి, అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్, సర్పంచులు లక్ష్మీనరసింహారెడ్డి, జంగయ్య, రమేశ్రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు నారాయణ, వీరయ్య, వైస్ చైర్మన్ సత్యం, ఎంపీటీసీ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్రావు పాల్గొన్నారు.
కడ్తాల్లో మంత్రులకు ఘన స్వాగతం
కడ్తాల్, నవంబర్ 8 : ఆమనగల్లులో సోమవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డిలకు కల్వకుర్తి నియోజకవర్గం ముఖద్వారామైన కడ్తాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్లు హరిచంద్నాయక్, కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహగౌడ్, నాయకులు చందోజీ, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వీరయ్య, నర్సింహ, వెంకటేశ్, సాయిలు, చంద్రమౌళి, రాజేందర్యాదవ్, భిక్షపతి, గణేశ్గౌడ్, అశోక్, రాంచంద్రయ్య, ఇర్షాద్, మహేశ్ ఉన్నారు.
కన్నులపండువగా ప్రమాణ స్వీకారోత్సవం
రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సంక్షేమానికి వ్యవసాయ, మార్కెట్ పాలవర్గం కట్టుబడి ఉండాలని మంత్రులు, నిరంజన్రెడ్డి, సబితారెడ్డి కోరారు. ఆమనగల్లు మార్కెట్ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన ఏఎంసీ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం కన్నుల పండువగా జరిగింది. జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి ఛాయాదేవి పాలకమండలి చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, డైరెక్టర్లు నిరంజన్రెడ్డి, నర్సింహగౌడ్, సుభాష్, చంద్రశేఖర్, రమేశ్నాయక్, లాయక్ఆలీ, కృష్ణయ్య, శ్రీనివాస్లతో ప్రమాణం చేయించారు. అనంతరం అతిథులు వారిని అభినందించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు సత్కరించారు. అంతకుముందు పట్టణంలో మంత్రులకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టణ పొలిమేరలో డప్పువాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి మంత్రులను సభకు తీసుకెళ్లారు.