ఇబ్రహీంపట్నం, జూలై 22 : హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న తులేకలాన్ (పెత్తుల్ల) గ్రామం గత పాలకుల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ చూసినా మురికి కాల్వలు, మట్టిరోడ్లు, రోడ్లపక్కన పెంటకుప్పలు దోమలు, ఈగల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రోత్సాహంతో కోట్లాది రూపాయలతో గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు నిర్మించారు. ఇంటింటికీ తాగునీటి సరఫరా, కమ్యూనిటీ భవనాలు, డ్వాక్రా భవనాలతో పాటు గ్రామంలో రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. రెండేండ్ల కాలంలో వైకుంఠధామం, వర్మీకంపోస్టుయార్డు, పల్లె ప్రకృతివనంతో పాటు వివిధ రకాల పనులను చేపట్టారు. ప్రతిరోజూ వీధులను శుభ్రం చేయడం, కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో తులేకలాన్ గ్రామం స్వచ్ఛతకు కేరాఫ్గా మారింది.
మొక్కలకు కంపోస్టు ఎరువు అందజేత..
గ్రామంలో ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ సేకరించిన చెత్తను కంపోస్టు యార్డుకు తరస్తున్నారు. ఆ చెత్త ద్వారా తయారు చేసిన కంపోస్టు ఎరువును పల్లె ప్రకృతివనం, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు అందజేస్తున్నారు. అవసరమున్న రైతులకు కంపోస్టు ఎరువును విక్రయించి గ్రామపంచాయతీకి ఆదాయం చేకూర్చుకుంటున్నారు.
స్వచ్ఛతకు కేరాఫ్గా గ్రామం..
తులేకలాన్ గ్రామం అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు కేరాఫ్గా మారింది. ప్రతిరోజూ ఉదయం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ చెత్తసేకరణ, ఉదయాన్నే రోడ్లను శుభ్రం చేసి హరితహారం మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తున్నారు. ముమ్మరంగా మరుగునీటి కాల్వలను శుభ్రం చేస్తున్నారు. సర్పంచ్ చిలుకల యాదగిరి ప్రతిరోజు ఉదయం గ్రామంలో పర్యటించి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రత్యేక చొరువ, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి కృషితో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ప్రతి కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.