మొయినాబాద్, జూలై 14 : భౌతిక నేరాలు తగ్గి, ఆన్లైన్ నేరాలు పెరిగాయని.. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు వెళ్లి మోసపోవద్దని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్ అన్నారు. బుధవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్ పెరిగిన తరువాత భౌతిక నేరాల కంటే ఆన్లైన్ నేరాలు బాగా పెరిగాయని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలెవరూ అత్యాశకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సెల్ఫోన్లకు ఇన్వెస్ట్మెంట్ మెసేజ్లు పంపి, తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉందని ఆశల ఊబిలో దింపుతారన్నారు.
తరువాత బ్యాంకు వివరాలు అడుగుతారని చెప్పారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఓటీపీ నెంబర్ చెప్పాలని అడుగుతారని, ఎవరైనా ఓటీపీ నెంబర్ చెబితే బ్యాంకులో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తారన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. క్రెడిట్ కార్డు మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. యూపీఐ నెంబర్ కూడా ఎవరికీ చెప్పరాదని సూచించారు.బక్రీదు పండుగను పురస్కరించుకుని ఆవులను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మతపరమైన సమస్యగా సృష్టించరాదని పేర్కొన్నారు. అలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు.