రంగారెడ్డి, సెప్టెంబర్ 21, (నమస్తే తెలంగాణ) : సమర్థులకే జిల్లా పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల నియామకంపై బుధవారం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో, గురువారం వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సబితాఇంద్రారెడ్డి చర్చించనున్నారు. అనంతరం ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి తెలియజేయనున్నారు. ఇప్పటికే గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తికావడంతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. మూడేండ్లుగా జిల్లా అధ్యక్ష పదవి లేకుండా ఇన్చార్జీలతో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి జిల్లా కమిటీలను కూడా నియమించేందుకు అధిష్ఠానం నిర్ణయించడంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న పలువురు జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం
బుధవారం రంగారెడ్డి జిల్లా, గురువారం వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సబితారెడ్డి సమావేశం కానున్నారు. జిల్లా అధ్యక్షులతోపాటు కార్యవర్గ ఎన్నికపై వారితో చర్చిస్తారు. ఏకాభిప్రాయానికి వచ్చిన అనంతరం ఆశావహుల పేర్లను పార్టీ అధిష్ఠానానికి అందజేస్తారు.
దాదాపు పూర్తైన గ్రామ, మండల, పట్టణ కమిటీలు
టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 2న జెండా పండుగతో పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు అన్ని స్థాయిల్లోని కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామ, వార్డు కమిటీలు ఐదు రోజుల క్రితమే పూర్తి కావడంతోపాటు మండల, పట్టణ కమిటీల ఎన్నిక కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని మండల, పట్టణ కమిటీల ఎన్నిక పూర్తి కాగా.. షాద్నగర్ నియోజకవర్గంలోని చౌదరిగూడెం, ఫరూఖ్నగర్, కొందుర్గు మండల కమిటీలు పూర్తికాగా, కేశంపేట, నందిగామ, కొందుర్గు మండల కమిటీలను బుధవారం ఎన్నుకోనున్నారు.
పట్టణ కమిటీలకు సంబంధించి షాద్నగర్ మున్సిపాలిటీ కమిటీ ఎన్నిక పూర్తికాగా.. కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నిక ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కమిటీ పూర్తికాగా, ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, నవాబుపేట మండలాల కమిటీలతోపాటు శంకర్పల్లి పట్టణ కమిటీలను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే యాదయ్య కసరత్తు చేస్తున్నారు. పార్టీ కొత్త కమిటీలతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వేల మంది ఆశావహులకు పార్టీ పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల్లో చోటు దక్కిన గులాబీ శ్రేణులు నయా జోష్తో గ్రామగ్రామాన గులాబీ జెండాను ఎగురవేస్తున్నారు. మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక పూర్తైన దృష్ట్యా అనుబంధ సంఘాలైన విద్యార్థి, కార్మిక, మహిళా, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ మీడియా కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత కమిటీల్లో ఒక్కో కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు.