షాబాద్, నవంబర్ 1 : నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్, రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డిజిల్లాలో వానకాలంలో లక్షా70వేల మెట్రిక్ టన్నులవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందుకు తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యానికి అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలని, రైతులు పండించిన పంటను శుభ్రం చేసి, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతుల వివరాలు ఆన్లైన్లో కచ్చితంగా నమోదు చేసి టోకెన్ ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల వారికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందరూ కలిసి సమష్టిగా పనిచేయాలని సంబంధిత అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్మిల్లర్లకు సూచించారు.
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు పండించిన ధాన్యం శుభ్రంగా, తేమ లేకుండా తీసుకువచ్చేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, సివిల్ సప్లయ్ అధికారులు మనోహర్ రాథోడ్, శ్యామాలక్ష్మి, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్ చైర్మన్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.