ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాల క్రమబద్ధీకరణకు మరో చాన్స్
మరోసారి జీవో 58, 59 కింద భూముల క్రమబద్ధీకరణ
ఈనెల 21 నుంచి మార్చి ఆఖరు వరకు దరఖాస్తుకు గడువు
మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
125 గజాల్లోపు ఇండ్లకు ఉచిత క్రమబద్ధీకరణ
రంగారెడ్డి, ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ): పేద ప్రజలకు శుభవార్త. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశాన్నిచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59 ప్రకారం క్రమబద్ధీకరణకుగాను ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో జీవో నెంబర్ 58, 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జీవో 58, 59 ప్రకారం వేల మందికి భూముల రెగ్యులరైజేషన్తో పట్టాలిచ్చిన ప్రభుత్వం, మరోసారి పేద ప్రజలకు అవకాశం కల్పించింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలో ఉన్న వారి దరఖాస్తులను స్వీకరించి, 125 గజాల్లోపు ఉన్న స్థలాలను ఉచితంగానే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 125 గజాలకుపైన ఉన్న స్థలాలకు సంబంధించి మార్కెట్ ధర ప్రకారం క్రమబద్ధీకరించారు. అయితే తదనంతరం మరిన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉండడంతోపాటు అర్హులు ఉండడంతోపాటు పేద ప్రజలకు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చాన్స్ ఇచ్చారు. అయితే గతంలో మాదిరిగానే 125 చదరపు గజాలలోపు ఉన్న ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు, 125 గజాలకు మించి ఉన్న ఇండ్ల స్థలాలకు సంబంధించి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో ప్రభుత్వం కల్పించిన అవకాశంతో రంగారెడ్డి జిల్లాలో జీవో 58, 59 ల కింద 5199 మంది చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఈనెల 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకుగాను ఈనెల 21 నుంచి దరఖాస్తు చేసుకునేందుకుగాను ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి నెలాఖరుతో ముగియనుంది. 58, 59 జీవో కింద దరఖాస్తు చేసుకునే వారు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు ఇండ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. ఆపైన సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2-06-2014 తేదీలోగా ఇండ్లు నిర్మించుకొని ఉన్న వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 59 కింద 50 శాతంమేర ఇండ్లు నిర్మించి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 58 కింద దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డుతోపాటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను చలాన్, విద్యుత్తు బిల్లు, నీటి బిల్లులను జతపర్చాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణకు సంబంధించి కమిటీ చైర్మన్గా ఆర్డీవో, సభ్యులుగా తసీల్దార్లు ఉండనున్నారు. 58, 59 జీవోల కింద వచ్చిన దరఖాస్తులను 90 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉన్నది.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, ఫిబ్రవరి 14 : ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జీవో నెంబర్ 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో జీవోలు 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. అప్పట్లో అనేక మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు సైతం అందజేశారు. జీవో నెంబర్ 58 ప్రకారం వికారాబాద్ జిల్లాలో మొత్తం 520 దరఖాస్తులు అందాయి. కొడంగల్లో 46, పెద్దేముల్లో 11, తాండూరులో 463 దరఖాస్తులు అందాయి. జీవో నెంబర్ 59 కింద 57 దరఖాస్తులు అందించారు. వాటిలో ధారూరులో 2, కులకచర్లలో 3, మోమిన్పేట్లో 1, నవాబుపేట్లో 1, పరిగిలో 1, పూడూరులో 35, వికారాబాద్లో 14 రావడం జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మాణం చేపట్టిన వారికి ఇది వర్తిస్తున్నది.
ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తులు అందజేయవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా అనేక ఏండ్లుగా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకుని ఉంటున్న వారికి క్రమబద్ధీకరణకు ఇదో చక్కటి అవకాశంగా పేర్కొనవచ్చు. 100 గజాల్లోపు స్థలం ఉంటే ఉచితంగా, ఆ పైగా ఉంటే స్థలం ఆధారంగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. తద్వారా ఆయా స్థలాలకు విలువ పెరుగుతుంది. ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేయడం వల్ల వాటి విలువ సైతం పెరుగుతుంది. గతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారు వాటిని విక్రయించాలంటే నోటరీ ద్వారా రాసిచ్చేవారు. క్రమబద్ధీకరణ ఆస్తుల విలువ పెరుగడంతోపాటు యాజమాన్య హక్కు లభించి, తమ ఆస్తులు విక్రయించే సమయంలో వాటిని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దీంతో గతంలో కంటే అధికంగా ఈ ఆస్తులకు ధర లభిస్తుందని చెప్పవచ్చు. ఏదిఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు మరింత మేలు చేకూరుతుంది.
పేదలకు ఎంతో ఉపయోగం
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం సంతోషకరం. గతంలో ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకున్న వారికి పర్మినెంట్ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగనున్నది. ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు రుణపడి ఉంటారు.
– కారు చెన్నయ్య, బోడంపహాడ్, షాబాద్