మంచాల, నవంబర్ 20 : కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో బుగ్గ రామలింగేశ్వరస్వామిని 50వేల మందికి పైగా దర్శించుకున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో జాతర మార్మోగింది. జాతరలో ఎటుచూసినా భక్త జనమే అగుపించింది. కార్తిక పుణ్య స్నానాలను ఆచరించేందుకు గుండం వద్ద క్యూ కట్టారు. అనంతరం గుండంలో ఉన్న పార్వతీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వయంభు శివలింగాన్ని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధానంలో కోరిన కోర్కెలు నెరవేరినందుకు ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించారు. మహిళలు, యవతులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో ఉన్న నాగన్న పుట్ట, కబీర్దాస్ మందిరం, నర్సింహబాబా సమాధి వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ సమీపంలోని ఉన్న చెట్ల కింద కుటుంబ సమేతంగా వనభోజనాలు చేశారు. సాయంత్రం జాతరలో నెలకొల్పిన దుకాణాల్లో స్వీట్లు, ఆటవస్తువులు, గాజులు తదితర వాటిని కొనుగోలు చేశారు.
భక్తుల రద్దీతో కిటకిట..
ఒకే రోజు 50వేల మందికి పైగా జాతరకు తరలిరావడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు నానా కష్టాలు పడ్డారు. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు. ఇబ్రహీంపట్నం నుంచి బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర వరకు 5నిమిషాలకోసారి ప్రత్యేక బస్సులను నడిపించారు.