రంగారెడ్డి, సెప్టెంబర్ 6, (నమస్తే తెలంగాణ): జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నా యి. బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లు గా మార్చేందుకుగాను నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాగా, ఒకట్రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు జాతీ య రహదారుల శాఖ సమయాత్తమవుతున్నది. ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉండడంతోపాటు చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి నాలుగు లేన్ల రహదారిగా విస్తరణకు సంబంధించి పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావించడంతో ఎట్టకేలకు కేంద్రం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే బీజాపూర్ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు చేరుకోగా వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు కూడా రానున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. గత మూడేండ్లగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో అయితే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరుగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అంతేకాకుండా అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆమోదం లభించింది.
రూ.వెయ్యి కోట్లతో రహదారి విస్తరణ
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.200 కోట్లకు పెంచుతూ ప్రణాళికను సిద్ధం చేశారు.. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర జరిగే నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేయనుంది. రోడ్డు విస్తరణ పనులకుగాను 350 ఎకరాల మేర భూములను కూడా సేకరించనున్నారు. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ వే తరహాలో బీజాపూర్ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రహదారి కొన్ని చోట్ల 25 మీటర్లు, మరికొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారి విస్తరించి నాలుగు లేన్లుగా మార్చనున్నారు. అయితే ఇప్పటికే మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారిగా ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. 46 కిలోమీటర్ల పరిధిలో ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా బైపాస్ రోడ్లను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రెండు బైపాస్ రోడ్లు కూడా జిల్లాలోనే నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్న దృష్ట్యా టోల్ప్లాజాను కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
త్వరలో కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు : చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ఇప్పటికే కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ఫైల్ కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఉంది, రెండు రోజుల క్రితమే ఆర్థిక శాఖ అధికారులను వెళ్లి కలిశాను. త్వరలోనే 46 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తారు.