వికారాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చేయూత అందించడం కోసం రాష్ట్ర సర్కార్ విశేష కృషి చేస్తున్నది. ఆ దిశగా సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో అలాంటివారిని గుర్తించడం కోసం భవిత కేంద్రాలకు చెందిన రిసోర్స్ పర్సన్లు ఈ నెల 1 నుంచి సర్వే చేస్తున్నారు. నెలఖారు వరకు మానసిక, శారీరక వైకల్యాలతోపాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం జల్లెడ పడుతున్నారు. జిల్లాలో 1857 మంది ఉన్నట్లు గుర్తించారు. బుద్ధి మాంద్యం, వివిధ వైకల్యాలతో బాధపడేవారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ.. శిక్షణ ద్వారా మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు.
ప్రత్యేక సర్వేలో గుర్తింపు..
సర్వేలో భాగంగా రిసోర్స్ పర్సన్లు ప్రతి గ్రామంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. నూతనంగా గ్రామంలో ఎవరైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారా..? అని ఆరా తీస్తూ సర్వే సాగించారు. 0-19 ఏండ్ల లోపు వారిని గుర్తించారు. మొత్తం 21 రకాల వైకల్యాలుండగా.. అందులో నిర్దేశిత వైకల్యాన్ని నమోదు చేయడంతో పాటు అవసరం మేర శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బాల్యంలోనే వైకల్యంతో అవస్థలు పడుతున్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. 5 ఏండ్ల నుంచి 19 ఏండ్లలోపు వారికి భవిత కేంద్రాల ద్వారా పాఠశాల సంసిద్ధత నైపుణ్యాలు, ఫిజియో, స్పీచ్, ఆక్యుపంక్చర్ థెరపీలు, వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తారు. ప్రధానంగా మూడు రూపాల్లో చేయూత ఇస్తున్నారు. అచేతనావస్థలో ఉన్నవారికి ఇంటి వద్దనే శిక్షణ ఇస్తున్నారు. ఆర్పీలు నేరుగా ప్రతి శనివారం ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తారు. కదలిక వచ్చేలా వ్యాయామాలు, ఫిజియో, స్పీచ్ థెరపీ నిర్వహిస్తారు. పరిస్థితి మెరుగైతే తర్వాత భవిత కేంద్రాల్లో చేర్చి శిక్షణ ఇస్తారు. భవిత కేంద్రాల ద్వారా పాఠశాలలకు వెళ్లేలా బాలలను సంసిద్ధం చేస్తారు. చదువుల్లో ప్రాథమిక అంశాలు నేర్పిస్తారు. బడులకు వెళ్లే స్థితిలో ఉన్నవారిని గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్చేలా చర్యలు చేపట్టారు.
ఇదీ పరిస్థితి..
మానసిక, శారీరక వైకల్యాలతోపాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం అన్ని విద్యాసంస్థలతోపాటు వీటిని కూడా మూసేశారు. దీంతో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరఫీ వంటి సేవలకు బ్రేక్ పడింది. భవిత కేంద్రాల పరిధిలో 1857 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నట్లు ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించారు. కొవిడ్ పరిస్థితుల్లో గత విద్యా సంవత్సరం నుంచి ఆర్సీలు టెలీ సర్వీసెస్ ద్వారా శిక్షణ నిర్వహిస్తున్నారు. బాలలు, సంరక్షకుడికి తగిన సూచనలు, సలహాలు చేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 1857 మందిని గుర్తించారు. ఇందులో 945మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. 240మంది భవిత కేంద్రాల్లో, 115మంది ఇంటి వద్ద, 479 మంది బడి బయట, 78 మంది అంగన్వాడీల్లో ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. ఇందులో 399 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. వీరికి ైస్టెఫండ్, ఎస్కార్టు చార్జీలు అందజేస్తున్నారు. గతేడాది రూ.9.45లక్షలు వీరి ఖాతాల్లో జమయ్యాయి. ఈ ఏడాదీ ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశముంది. బ్యాంకుల ఖాతాలు ఇవ్వనివారు త్వరగా ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వైకల్య సమస్యలు ఎదురైతే వెంటనే గుర్తించాలి
రవి, సెక్టోరియల్ అధికారి, వికారాబాద్ జిల్లా చిన్నారులు ముఖ్యంగా 0-5 సంవత్సరాల పిల్లల్లో వైకల్య సమస్యలు ఎదురైతే వెంటనే గుర్తించాలి. ఆరు నెలలైనా తలెత్తకపోవడం, దృష్టి సరిగా నిలుపకపోవడం, పాకలేని పరిస్థితులు, ఇతర సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి. ఇదే క్రమంలో మండలాల్లోని భవిత కేంద్రాలను సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. 399మందికి బ్యాంకు ఖాతాలుండగా.. వీరికి ైస్టెఫండ్, ఎస్కార్టు చార్జీలు అందజేస్తున్నారు. గతేడాది రూ.9.45లక్షలు వీరి ఖాతాల్లో జమయ్యాయి.