‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాలలను సందర్శించిన ప్రత్యేకాధికారులు
మౌలిక వసతులపై సమావేశాల నిర్వహణ
దోమ, ఫిబ్రవరి 19 : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేకూరి పాఠశాలల్లో కొత్త శోభ సంతరించుకోనుందని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల చైర్మన్లతో కలిసి జడ్పీహెచ్ఎస్ బొంపల్లి పాఠశాలలో సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, పెయింటింగ్, టాయిలెట్స్, తాగునీరు, డ్యూయల్ డెస్క్ బెంచీలు తదితర మౌలిక వసతుల ఏర్పాటు గురించి తీర్మానించి అధికారులకు పంపించినట్లు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 19 : మండలంలోని దీప్లానాయక్తండా ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం నిర్వహించారు. పాఠశాల మరమ్మతులు, నీటి సౌకర్యం, టాయిలెట్లు, ప్రహరీ నిర్మాణం వంటి వాటిని చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.
కోట్పల్లి, ఫిబ్రవరి 19 : మండలంలోని మల్శేట్పల్లితండా, జిన్నారం, ఎన్నారం, అన్నాసాగర్, కోట్పల్లి పాఠశాలలను మండల ప్రత్యేకాధికారి రాజేశ్వర్ సందర్శించి మన ఊరు-మన బడికి సంబంధించిన కమిటీ సభ్యులతో పాఠశాలల్లో 12 అంశాలపై మాట్లాడారు.
యాలాల, ఫిబ్రవరి 19 : యాలాల మండలం పగిడియాల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శనివారం స్పెషల్ ఆఫీసర్ రాంరెడ్డి ఎంఈవో సుధాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం సర్పంచ్ బసిరెడ్డి, ఎంపీటీసీ రాములు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పార్వతీదేవి, వెంకట్రెడ్డి, కమిటీ చైర్మన్లు లక్ష్మి, వెంకటయ్య, ఏఈ లక్ష్మణ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విధివిధానాలను వివరించారు. అనంతరం సర్పంచ్ బసిరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలకు మిషన్ భగీరథ పైప్లైన్ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నూతన గదుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
కొడంగల్, ఫిబ్రవరి 19 : మున్సిపల్ పరిధిలో వ్యవసాయ అధికారి ఏడీఏ శంకర్నాయక్తోపాటు ఎంపీవో రాంరెడ్డి, ఏఈ శ్రీకాంత్రెడ్డి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు సీపీఎస్ బాలురు, బాలికల పాఠశాలను సందర్శించి పరిశీలించారు. మౌలిక వసతులను గుర్తించి నివేదిక తయారు చేయనున్నారు.