తలకొండపల్లి, సెప్టెంబర్ 6 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో తలకొండపల్లి దశ మారింది. రెండేండ్లలో ఊహించని అభివృద్ధి జరుగడంతో గ్రామ రూపురేఖలు మారాయి. మండల కేంద్రంగా ఉన్న తలకొండపల్లిలో 1,172 ఇండ్లు ఉండగా, 3,999 మంది జనాభా, 2,600 మంది ఓటర్లు ఉన్నారు. ఇదివరకు చెత్తాచెదారంతో చిత్తడిగా ఉన్న గ్రామం పరిశుభ్రంగా మారింది. కొన్ని కాలనీల్లో పురాతన ఇండ్లను కూల్చివేయగా, పాత బావులను పూడ్చివేశారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్తో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ.48 కోట్ల వ్యయంతో కడ్తాల్-షాద్నగర్, రూ.26 కోట్లతో తలకొండపల్లి మిడ్జిల్ బీటీ రోడ్డు పనులు పూర్తికావడంతో గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
పల్లెకు కొత్తందాలు..
‘పల్లె ప్రగతి’తో తలకొండపల్లి గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. రూ. 22లక్షలతో రైతువేదిక, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డును నిర్మించారు. రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా మారింది. ఇంటింటికీ 6మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటారు. వీటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదాం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. రూ.30 లక్షలతో మూడు వాటర్ ట్యాంక్లను నిర్మించారు. దీంతో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి రోజు సరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. రూ.6.42 లక్షలతో కాలనీల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీలో రూ.3.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.40.60లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో ఏ వీధి చూసినా శుభ్రంగా కనిపిస్తున్నది. గ్రామ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పచ్చని తోరణాల్లా కనువిందు చేస్తున్నాయి. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో నీటిని పోస్తూ సంరక్షిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి..
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పంచాయతీ పాలకులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు తదితర పనులను పూర్తి చేశాం.
-లలితజ్యోతయ్య, సర్పంచ్ తలకొండపల్లి
స్వచ్ఛ గ్రామంగా మారింది..
నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాం. ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించడంతో పాటు కలుపు మొక్కలు లేకుండా తొలగించాం. గ్రామంలో సమస్యలుంటే గ్రామసభలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.