మోమిన్పేట, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పరిశుభ్రత పచ్చదనంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. పచ్చటి అందాలు, చూడచక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగు కాల్వల నిర్మాణం, చెత్త సేకరణకు, మొక్కలకు నీరు పట్టేందుకు ట్రాక్టర్, ట్యాంకర్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పురాతన ఇండ్లు కూల్చివేత, పాడుబడిన బావులు పూడ్చివేత, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో వీధులు కళకళలాడుతున్నాయి.
కోటి నిధులతో అనేక అభివృద్ధి పనులు
పల్లె ప్రగతితో స్వచ్ఛత, ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో టేకులపల్లి అభివృద్ధికి కేరాఫ్గా నిలిచింది. గ్రామంలో 3068 జనాభా, 705 ఇండ్లు ఉన్నాయి. రెండేండ్లలో గ్రామాభివృద్ధికి కోటి రూపాయలకు పైగా జడ్పీ, ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ, మండల పరిషత్ నిధులు ఖర్చు చేశారు. రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.21 లక్షలతో పంచాయతీ నూతన భవనం, రూ.30 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైనేజీ, మురుగు కాల్వల నిర్మాణం, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు పనులు చేపట్టారు. పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి, డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి.
ఆహ్లాదకరమైన ప్రకృతి వనం
గ్రామ పరిధిలోని ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పా టు చేశారు. చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, 4000లకు పైగా వివిధ రకాల మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. గ్రామ ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా 400 మొక్కలు నాటారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామ నర్సరీలో 1000 పైగా మొక్కలు పెంచుతున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
టేకులపల్లి గ్రామ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంలో టేకులపల్లి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి ఇంకా నిధులు సమకుర్చితే రైతుల సౌకర్యం కోసం టేకులపల్లి నుంచి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం. అభివృద్ధి పనులకు గ్రామస్తుల పూర్తి సహకారం ఉంది. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతాం.
పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠ ధామం, చెత్త సేకరణ, మొక్కలు నాటడం, 100 శాతం మరుగు దొడ్ల నిర్మాణం, తదితర పనులతో గ్రామాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దుతున్నాం. గ్రామస్తుల పూర్తి సహకారంతో పచ్చదనం, పరిశుభ్రత వైపు అడుగులు వేస్తున్నాం. పల్లె ప్రగతి పనులను పూర్తి చేస్తున్నాం.
గ్రామాభివృద్ధే లక్ష్యం
గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నాం. మండల పరిషత్ నిధులు రూ.4 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం. గ్రామాన్ని పరిశుభ్రత, పచ్చదనం వైపు తీసుకువెళ్తున్నాం. మండల పరిషత్ నుంచి మరిన్ని నిధులు సమకుర్చి, గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. – డాకురి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ, టేకులపల్లి