గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏడు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాల్లో అమలు
463 మంది విద్యార్థులకు ప్రయోజనం
మార్చి 1 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ముగిసేదాకా అమలు
బొంరాస్పేట, ఫిబ్రవరి 19 : ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులు అసెస్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లను కేటాయించి అందరినీ ఉత్తీర్ణులను చేశారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో పాఠశాలల్లో విదార్థులకు ప్రత్యక్ష బోధన గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించారు. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో కాకుండా మే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ ఫలితాలను సాధించడానికి పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులే కాకుండా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ను నిర్వహిస్తుంటారు. దీనివల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా అలసిపోయి నీరసిస్తుంటారు. వీరికోసం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేకంగా రెండు పూటలా అల్పాహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ రూ.20 చొప్పున ప్రభుత్వం దీనికి ఖర్చు చేస్తున్నది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు మరింత ఉత్సాహంగా, ఏకాగ్రతతో తమ చదువులను కొనసాగించే అవకాశం ఉన్నది. ప్రత్యేకంగా అల్పాహారం అందించే కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమై వార్షిక పరీక్షలు ముగిసే వరకు అంటే 83 రోజులపాటు కొనసాగనున్నది.
జిల్లాలో 463 మంది విద్యార్థులకు ప్రయోజనం
వికారాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 463 మంది పదోగతరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బొంరాస్పేట మండలం బొట్లవానితండా బాలికల ఆశ్రమ పాఠశాలలో 57 మంది, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల బాలికల ఆశ్రమ పాఠశాలలో109 మంది, రాంపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో 52 మంది, మర్పల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో 19మంది, చౌడాపూర్ మండలం కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో 36 మంది, కుల్కచర్ల బాలుర ఆశ్రమ పాఠశాలలో 40మంది, తాండూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో 14 మంది విద్యార్థులున్నారు. వసతి గృహాల విషయానికి వస్తే వికారాబాద్ ఎస్టీ బాలుర వసతి గృహంలో 22మంది, కొడంగల్ బాలుర వసతి గృహంలో 18 మంది, కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ బాలుర వసతి గృహంలో 57 మంది, పరిగి బాలుర వసతి గృహంలో 22 మంది, తాండూరు బాలుర వసతి గృహంలో 17 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి ప్రయోజనం కలుగుతుంది. అల్పాహారం కింద ఉదయం, రాత్రి రెండు పూటలా టీ, బిస్కెట్లు, పండ్లు అందజేస్తారు.
ప్రత్యేక బోధనకు ట్యూటర్లు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐదు వసతి గృహాల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు అధికారులను ట్యూటర్లను నియమించారు. ఆంగ్లం, గణితం, సైన్స్, హిందీ సబ్జెక్టులను బోధించడానికి ఒక్కో వసతి గృహంలో నలుగురు ట్యూటర్ల చొప్పున ఐదు వసతి గృహాల్లో 20 మందిని నియమించారు. వీరికి నెలకు రూ.1500ల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అదేవిధంగా 463 మంది ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక నోటు పుస్తకాలు, కాంపాక్స్ బాక్సులు, ఆల్ ఇన్ వన్ పుస్తకాలతో పాటు రూ.50ల విలువ చేసే స్టడీ మెటీరియల్ను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి 1 నుంచి అమలు చేస్తాం
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది ఎస్సెస్సీ విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీ నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా టీ, బిస్కెట్లు, పండ్లు అందిస్తాం. దీనివల్ల జిల్లాలో 463 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పది విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించాం. స్టడీ మెటీరియల్ను కూడా అందజేస్తాం.
-కోఠాజీ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి