ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: మండలంలోని మంగల్పల్లి గ్రామంలో అత్యంత మహిమగల మహమ్మాయిదేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 500 ఏండ్ల చరిత్ర కలిగిన మంగల్పల్లి మహమ్మాయి ఆలయం ఈ ప్రాంత భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నది. ఈ ఆలయాన్ని అకన్న, మాదన్నల కాలంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. వారంరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో మహమ్మాయిదేవితోపాటు పరమశివుడు కూడా కొలువుదీరారు. స్వామివారి పాదాల ముందు నుంచే నీటిగుండం ఉండటం విశేషం. ఈ గుండం ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. కాగా, ఈ ఆలయంలో సంతోషిమాత, ఆంజనేయస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఉప ఆలయాలున్నాయి. ఈ ఉత్సవాల్లో భా గంగా ఇక్కడ వీధినాటకాలను ప్రదర్శించటం ఆనవాయితీగా వస్తున్నది. ఈనెల 16, 17తేదీల్లో రథోత్సవాలను పురస్కరించుకుని నల్లపోచమ్మ వీధినాటకాన్ని ప్రదర్శించనున్నారు.
ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంతోపాటు హైదరాబాద్ నుంచి మంగల్పల్లికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. 15 నిమిషాలకోసారి ఇబ్రహీంపట్నం నుంచి మంగల్పల్లికి అలాగే, మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి 277, కోఠి నుంచి 277పీ, చార్మినార్ నుంచి 277కే, సికింద్రాబాద్ నుంచి 279 బస్సు సౌకర్యాలను కల్పించారు. పోచారం, కొంగరకలాన్, ఎలిమినేడు మీదుగా వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక బస్సుసౌకర్యాలు కల్పించారు.