ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.105 కోట్ల నిధులతో నాలాల పనులు
బడంగ్పేట్లో రూ.60 కోట్లు, బాలాపూర్లో రూ.29 కోట్లతో..
ప్రతిపాదనలు సిద్ధం
తీరనున్న వరద నీటి సమస్య
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి అధికారులతో సమావేశం
రంగారెడ్డి, ఫిబ్రవరి 12, (నమస్తే తెలంగాణ): జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో వరద నీటి సమస్యను తీర్చేందుకు ఎస్ఎన్డీపీ కింద రూ.194 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. ఇటీవల రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వరద ముంపు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. గొలుసుకట్టు చెరువులను కలిపేందుకు, వరద నీరు సాఫీగా వెళ్లేందుకుగాను నాలాలు దోహదం చేస్తాయన్నారు. రూ.89 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలోని నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదించామని, వీటిలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.60 కోట్లతో పనుల కోసం ప్రతిపాదించామన్నారు. సున్నం చెరువు నుంచి ఓఆర్ఆర్ ఇదుల చెరువులో వరద నీరు కలిసేలా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
సున్నం చెరువు నుంచి గ్రీన్ హోమ్స్, పోస్టల్ కాలనీ, ఎంఎల్ఆర్ కాలేజ్, ఆదిత్యనగర్ ఫేజ్-4, మాసాబ్ చెరువు వరకు బడంగ్పేట్ కార్పొరేషన్లో నాలాల అభివృద్ధికి నిర్ణయించామన్నారు. అదేవిధంగా రూ.29 కోట్లతో బాలాపూర్ పెద్ద చెరువు నుంచి కొత్తమోని కుంట వరకు, బురాన్ఖాన్ చెరువు నుంచి పెద్ద చెరువు వరకు నాలాల ఏర్పాటుకు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. రూ.105 కోట్ల నిధులతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాసాబ్ చెరువు నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల మీదుగా దిల్వార్ఖాన్ చెరువు, సూర్యవంశీ గార్డెన్, ఇదుల చెరువు, ఓఆర్ఆర్ వరకు వరద నీటి సమస్యను తీర్చేందుకు నాలాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.