షాద్నగర్, మే 5 : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, పాలమూరు అభివృద్ధి కోసం పైసా కూడా ఇవ్వని కేంద్రంలోని బీజేపీలకు ఓటు వేయవద్దని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్లు ప్రజలను కోరారు.
ఆదివారం షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల, మధురాపూర్, కడియాల కుంట తండా, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, వేముల్నర్వ, సంగెం గ్రామాలతో పాటు షాద్నగర్ పట్టణంలో ర్యాలీలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నదన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని, ఇది ప్రజలు గమనించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లా కోసం ఒక్క పైసా కూడా కేటాయించలేదని, ఒక్క ప్రాజెక్టుకైనా నిధులు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్, బీజేపీలు యువతను మోసం చేశాయన్నారు. మళ్లీ ఆగం కాకుండా కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రాంబాల్నాయక్, వంకాయల నారాయణరెడ్డి, నరేందర్, జగదీశ్వర్గౌడ్, విష్ణువర్ధన్రెడ్డి, రంగయ్యగౌడ్, బుచ్చిగూడ వెంకట్రెడ్డి, బక్కన్నయాదవ్, రవియాదవ్ పాల్గొన్నారు.