రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు విడుదల అయ్యాయి. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పూర్తైన ఇండ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల నిమిత్తం రూ.9.06 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులతో పెండింగ్లో ఉండడంతో నిధులు మంజూరుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తీసుకుపోవడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తైన చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 13 కాలనీల్లో ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్లు, భవనాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం నిధులిచ్చిన దృష్ట్యా నెలరోజుల్లోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ డి.అమయ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరగా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దృష్ట్యా, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు 2,637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది.
త్వరగా ఇండ్ల కేటాయింపు..
గూడులేని పేద ప్రజల సొంతింటి కలను త్వరలోనే నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. జిల్లాలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా లబ్ధిదారులకు కేటాయించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యాయి. జిల్లాలో పూర్తైన ఇండ్లలో 1880 ఇండ్లు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించినవికాగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 335 ఇండ్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 192 ఇండ్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 130 ఇండ్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 100 ఇండ్ల నిర్మాణం పూర్తైంది. మరోవైపు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బైరాగిగూడ, శంషాబాద్లలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా పూర్తి కావడంతో కిస్మత్పూర్లో త్వరగా మౌలిక వసతులను కల్పించి మొదటగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజకవర్గానికి 1060, కల్వకుర్తికి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నానికి 1239, షాద్నగర్ నియోజకవర్గానికి 3100, రాజేంద్రనగర్కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ..
జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయ్యింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పలు నియోజకవర్గాల్లో పూర్తికాగా, సంబంధిత ఇండ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన డబుల్ బెడ్రూం దరఖాస్తుల్లో అర్హులను తేల్చేందుకుగాను దరఖాస్తులను ఇప్పటికే టీఎస్టీఎస్(తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసెస్)కు జిల్లా గృహనిర్మాణ శాఖ అందజేసింది. దరఖాస్తుల వారీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలతో దరఖాస్తుదారులకు సొంతిల్లు ఉందా, గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లు పొందారా, భూమి, కారు ఉందా లేదనేది వివరాలను పరిశీలించిన టీఎస్టీఎస్ అధికారులు, ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇండ్లు మంజూరైనట్లయితే సంబంధిత దరఖాస్తులను తిరస్కరించి, మిగతా దరఖాస్తులను జిల్లా యంత్రాంగానికి అందజేశారు. దరఖాస్తులను వడబోసిన దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన వారికి జిల్లా యంత్రాంగం ఎంపిక చేయనున్నది. గృహనిర్మాణ అధికారులు, రెవెన్యూ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
కాగా, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం ఆధార్ కార్డుల వివరాలతో దరఖాస్తుదారులకు ఇంతకుముందు ఇల్లు మంజూరైందా, కారు ఉందా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబమేనా తదితర వివరాలను సేకరించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు జరగకూడదనే ఉద్దేశంతో ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో స్థానికులతోపాటు స్థానికేతరులకు నిర్దేశించిన కోటా ప్రకారం కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు 7శాతం, ఇతరులకు 43 శాతం లెక్కన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లకై 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
త్వరగా పనులు పూర్తి
జిల్లాలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులను కల్పించేందుకుగాను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. మౌలిక సదుపాయల పనులు పూర్తైన వెంటనే ప్రభుత్వం అర్హులకు ఇండ్లను కేటాయిస్తుంది. గృహనిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, నిజమైన అర్హులను ఎంపిక చేయనున్నారు. – కలెక్టర్ డి.అమయ్కుమార్