రంగు రంగుల భవనాలు, సకల సౌకర్యాలు
రూ.40లక్షలతో వసతులు కల్పించిన నిర్మాణ్ సంస్థ
వాటర్ ఫిల్టర్, డైనింగ్ హాల్, టాయిలెట్లు మరెన్నో..
అందుబాటులో నాణ్యమైన బోధన
ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
ఇంగ్లిష్ మీడియంతో మరింత ఆదరణ
కేశంపేట, ఫిబ్రవరి 14 : మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాల కొత్త కళను సంతరించుకున్నది. హైదరాబాద్కు చెందిన నిర్మాణ్ సంస్థ సుమారు రూ.40 లక్షల వ్యయంతో స్కూల్లో అన్ని వసతులు కల్పించింది. పాఠశాల భవనాలకు రంగులు, తరగతి గదుల గోడలపై స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, పాఠ్యాంశాలలోని ముఖ్య ఘట్టాలను పెయింటింగ్ వేయించారు. డిజిటల్ బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న సుమారు 400 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్ హాల్ను నిర్మించారు. అధునాతన టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా రూ.3 లక్షల వ్యయంతో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశారు. నిర్మాణ్ సంస్థ కృషితో ప్రస్తుతం స్కూల్ అందంగా ముస్తాబై కార్పొరేట్ పాఠశాలను తలపిస్తున్నది. నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉండడంతో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టనున్నది. దీంతో ఈ పాఠశాలకు మరింత ఆదరణ పెరుగనున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
విద్యార్థుల్లో నూతనోత్సాహం..
పాఠశాలలో నిర్మాణ్ సంస్థ వారు అన్ని వసతులు కల్పించారు. తరగతి గదుల పునరుద్ధరణ, మినరల్ వాటర్ ప్లాంట్, డైనింగ్హాల్, టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేశారు. వాల్ పెయింటింగ్స్ విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. నేటి ఆధునికతకు అనుగుణంగా డిజిటల్ బోధనకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది.
–శ్రీనివాససాగర్, ఉపాధ్యాయుడు, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల
సర్కార్ బడిపై ఆసక్తి పెరుగుతున్నది..
సకల సౌకర్యాలు, నాణ్యమైన విద్య లభిస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి రానుండడంతో ప్రైవేటుకు స్వస్తి చెప్పి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తపేట పాఠశాల అభివృద్ధికి నిర్మాణ్ సంస్థ ఎంతో కృషి చేసింది.
– నవీన్కుమార్, సర్పంచ్, కొత్తపేట