యాచారం, డిసెంబర్ 23: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సర్పంచ్ ఉదయశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ.. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించారు. వరి ధాన్యానికి ఏ గ్రేడుకు రూ.1960, సాధారణ రకానికి రూ.1940 మద్దతు ధరను కల్పించిన్నట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలన్నారు. ధాన్యం పండించిన కౌలు రైతుల ఖాతాలోకే నేరుగా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులను కల్పించినట్లు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ జంగమ్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ డేరంగుల శారద, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కారింగు యాదయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, ఎంపీడీవో మమతాబాయి, వ్యవసాయాధికారి సందీప్, ఏపీఎం సతీశ్, ఏపీవో లింగయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి గాయత్రి, సీసీలు స్వరూప, గణేశ్, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, పంది సుధాకర్, ముచ్చర్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ అన్నారు. మండలంలోని నందివనపర్తి, ధర్మన్నగూడ, అయ్యవారిగూడ గ్రామాల్లో జల్శక్తి అభియాన్ అనే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా గ్రామస్తులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మమతాబాయి, సర్పంచ్లు ఉదయశ్రీ, బాషయ్య, గంగాబాయి, ఎంపీటీసీలు శారద, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జోగిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.