వికారాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పాలనను గాడిలో పెట్టడంతోపాటు పేదలకు సత్వర సేవలందించేలా కలెక్టర్ నారాయణ రెడ్డి కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులందరూ సక్రమంగా విధులకు హాజరయ్యేలా కలెక్టరేట్లో బయోమెట్రిక్ విధానంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పాలనాధికారి నిర్ణయించారు. వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్లోని అన్ని శాఖలకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకు రానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అయితే ఇకపై జిల్లాలోని ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే చెల్లించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణితోపాటు జియో అటెండెన్స్ యాప్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరులో మార్పు రావాలంటే కొత్త సంస్కరణలు ఎంతైనా అవసరమని, జియో అటెండెన్స్ యాప్ ద్వారా విధులకు సక్రమంగా హాజరు కాని వారిని వెంటనే ట్రాప్ చేయవచ్చన్నారు.
జియో అటెండెన్స్ యాప్ ద్వారా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నందున పని చేయాల్సిందేనని ఆదేశించారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు పని చేయని పక్షంలో సంస్థకు నష్టం కలుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేయకుంటే ప్రజలకు నష్టం జరిగే అవకాశముందన్నారు. వారం రోజుల్లో జియో అటెండెన్స్ యాప్ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం వరకు ట్రయల్ రన్ నిర్వహించి, సోమవారం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరుస్తామన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే ట్రెజరీల ద్వారా జీతాలను చెల్లింపుల ప్రక్రియను చేపడుతారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులందరూ సమిష్టిగా పనిచేసి జిల్లాను టాప్-5లో నిలిచేలా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు ప్రజావాణిలో వచ్చే ప్రతీ దరఖాస్తును వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దరఖాస్తులకు సంబంధించి కోర్టు కేసుల్లో ఉన్న సమస్యలు మినహా మిగతా వాటిని పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఇన్చార్జ్ డీఆర్వో అశోక్కుమార్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.