రంగారెడ్డి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, అందుకోసం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్తో ఆమె గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఈ నెల 25న నిర్వహించే నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాల్లో అన్ని స్థాయిల నేతలను భాగస్వాములను చేయాలని కోరారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మండల, మున్సిపల్, డివిజన్ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి, పార్టీ సమన్వయకర్త, శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ, శాసన మండలి సభ్యులు వాణీదేవి, బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, అంజయ్య యాదవ్, యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నా రు.