ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్పేట, ఫిబ్రవరి 19 : ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామస్తులు కరెంట్, మిషన్ భగీరథ నీటి కొరత, మురుగు కాలువలు, రెవెన్యూ సమస్యలు, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీని సకాలంలో పరిష్కరించి నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించారు. 3 రోజుల్లో పని పూర్తి చేసి గ్రామంలోఎక్కడ కూడా నీటి సమస్యలు లేకుండా చేయాలని ఆదేశించారు. గ్రామంలో రోడ్డు మధ్యలో ఉన్న పాత కరెంట్ స్తంభాలను తొలగించి గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చోటుబ మార్చాలని, వీధి దీపాలకు ఆన్ ఆఫ్ స్విచ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమంతో సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమ రంగాన్ని తారాస్థాయికి తీసుకెళ్తూ ఇంటింటికీ పథకాలను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యమిస్తూ.. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టిందన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో మోమిన్పేట మండలానికి చెందిన 42మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించినట్లు తెలిపారు. అనంతరం చంద్రయాన్పల్లి గ్రామంలో వార్డు మెంబర్ నాగమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు.
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలి
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దేవరంపల్లి గ్రామంలో జన్సాహన్ సంస్థ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ రేషన్ పోర్టల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, ఎంపీపీ వసంత, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరిశంకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.