ముంబై, మార్చి 25: దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయినప్పటికీ లాక్డౌన్లు విధించే అవకాశాలు లేవని, కనుక ఆర్థిక రికవరీకి విఘాతం కలగకపోవచ్చని చెప్పారు. ‘ఆర్థిక రికవరీ అప్రతిహతంగా కొనసాగుతుంది. కనుక 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.5 శాతంగా నమోదవుతుందన్న ఆర్బీఐ అంచనాను కుదించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో గురువారం ఆయన ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2008లో తలెత్తిన సంక్షోభంతో పోలిస్తే కొవిడ్-19 సంక్షోభం చాలా భిన్నమైనదన్నారు. ఆర్థిక రంగంపై ఇతర రంగాల క్షీణత ప్రభావం తీవ్రంగా పడుతున్నదని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి కోరల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా బయటపడలేదని, కరోనా కొత్త వేరియంట్లు ఆర్థిక రికవరీకి ఆటంకంగా మారుతున్నాయని తెలిపారు. దీని వల్ల ఏర్పడే సంక్లిష్ట పరిస్థితుల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల పటిష్ఠతను కాపాడటమే ఆర్బీఐ ముందున్న ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
విదేశాలకూ ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు
ప్రభావవంతమైన నిబంధనలకు ఆర్బీఐ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని శక్తికాత దాస్ స్పష్టం చేశారు. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలను 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వ్యవస్థలకు విదేశీ కరెన్సీ సేవలను అందించే సామర్థ్యం కూడా ఉన్నదని, కనుక వీటి సేవలను విదేశాలకు విస్తరించే అవకాశం ఉన్నదని చెప్పారు.